
ఎల్బీ స్టేడియంలో పోలీస్ కానిస్టేబుల్స్కు నియామక పత్రాలు అందించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. నిరుద్యోగులను ఆత్మహత్య చేసుకునే పరిస్థితి నుంచి బయట పడేయాలనే మా ప్రయత్నమన్నారు. ఆనాటి పాలకులు తమ కుటుంబం కోసం ఆలోచించారు తప్ప నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించలేదని, మా కుటుంబం 4కోట్ల తెలంగాణ ప్రజలు అని ఆయన అన్నారు. అందుకే మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించే బాధ్యత తీసుకున్నామని ఆయన వెల్లడించారు. న్యాయపరమైన చిక్కులు తొలగించి నియామక పత్రాలు అందిస్తున్నామని, 13,444 మంది ఉద్యోగులకు ఇవాళ నియామక పత్రాలు అందిస్తున్నామన్నారు. ఈ వేదికగా చెబుతున్నా.. మీ రేవంతన్నగా నిరుద్యోగ యువకులకు నేను అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. ఈ ప్రభుత్వం మీది.. ఇది పేదల ప్రభుత్వం.. ప్రజా ప్రభుత్వమని ఆయన స్పష్టం చేశారు. ఆనాటి ప్రభుత్వం వేసిన చిక్కుముడులను ఒక్కొక్కటిగా తొలగించుకుంటూ ముందుకు వెళుతున్నామని, నర్సింగ్ ఆఫీసర్స్, సింగరేణి ఉద్యోగాల్లో చిక్కుముడులు విప్పి నియామకాలు పూర్తి చేసామన్నారు రేవంత్ రెడ్డి.
అంతేకాకుండా..’మాట ఇచ్చినట్టుగానే 15 రోజుల్లో కానిస్టేబుల్స్ కు నియామకపత్రాలు అందిస్తున్నాం.. కేసీఆర్ తన బంధువులకు, కుటుంబ సభ్యులకు పదవులు లేకపోతే వంద రోజులు కూడా ఆగలేకపోయారు. కానీ కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న నిరుద్యోగుల గురించి ఆలోచించలేదు. తెలంగాణ సమాజం నిన్ను బహిష్కరించిందని ఇప్పటికైనా మీకు అర్థం కాలేదా కేసీఆర్.. ప్రజలు బండకేసి కొట్టారని ఇప్పటికైనా తెలుసుకోండి.. నిన్న నల్లగొండ వెళ్లి కేసీఆర్ బీరాలు పలుకుతుండు… నన్ను చంపుతారా అని కేసీఆర్ అంటుండు… చచ్చిన పామును ఎవరైనా చంపుతారా.. కేసీఆర్ నీ పని అయిపోయింది.. ఖేల్ ఖతం దుఖాన్ బంద్.. ఏ తప్పు లేకుండా.. ఎవరికి నష్టం జరగకుండా 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం.. పదేళ్లు నియామకాలు లేకపోవడంతో నిరుద్యోగులు నష్టపోతారని వయసు 44 నుంచి 46 ఏళ్లకు పెంచాం. మీ ఆశీర్వాదం ఉంటే పదేళ్లు కాదు 20ఏళ్లు ప్రజా ప్రభుత్వం ఉంటుంది.. కేసీఆర్ కు సూటిగా సవాల్ విసురుతున్నా.. పదేళ్లు వెంట్రుక కూడా పీకలేవ్.. గత పదేళ్లలో కేసీఆర్ తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టి మనకు రావాల్సిన నీటిని రాకుండా చేశారు. కేసీఆర్ సంతకం తెలంగాణ రైతులకు గుదిబండగా మారింది. ఒక్క సంతకంతో కేసీఆర్ తెలంగాణకు మరణశాసనం రాశారు. అది మేడిగడ్డ కాదు.. మేడిపండు.. పొట్ట విప్పితే పురుగులు బయటపడతాయనే నల్లగొండలో సభ పెట్టారు. తెలంగాణను కబలించడానికి గంజాయి , డ్రగ్స్ ముఠాలు తిరుగుతున్నాయి.. గంజాయి ముఠాను కూకటివేళ్లతో పెకిలించాల్సిన బాధ్యత మీపై ఉంది. తెలంగాణ యువతను నిర్వీర్యం చేసే గంజాయి, డ్రగ్స్ ముఠాలు రాష్ట్రంలో ఉండకూడదు.. ‘ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.