Leading News Portal in Telugu

Uttam Kumar Reddy : 6న కాళేశ్వరం పరిశీలనకు నిపుణుల కమిటీ రాక



Uttamkumar Reddy

బీఆర్‌ఎస్‌ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అవినీతి జరిగిందని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరోపిస్తోంది. అయితే.. ఈ నేపథ్యంలో మేడిగడ్డ పిల్లర్‌ ఘటన దీనికి మరింత బలాన్ని చేకూర్చుతుండగా.. కాళేశ్వరం నిర్మాణంపై విచారణ జరపాలని బీజేపీ సైతం కోరుతోంది. ఈ క్రమంలోనే.. 6వ తేదీన కాళేశ్వరం పరిశీలనకు నిపుణుల కమిటీ రానున్నట్లు నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. నిపుణుల కమిటీ రాకను స్వాగతిస్తున్నాం.. అన్ని రకాలుగా సహకరిస్తామన్నారు. నేషనల్ డ్యామ్ సెఫిటీ అథారిటీ సూచనలను ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఆయన తెలిపారు. గతంలో కుంగిపోయిన మెడిగడ్డ బ్యారేజ్ ను నేషనల్ డ్యామ్ సెఫిటీ అథారిటీ పరిశీలించి నీటిని ఖాళీ చేయాలని సూచించిందని, అనంతరం సుందిళ్ళ, అన్నారం బ్యారేజ్ లను పరిశీలించిన డ్యామ్ సెఫిటీ అథారిటీ మెడిగడ్డ లో ఉన్న సమస్యలు ఇక్కడ కూడా ఉన్నాయని ఈ రెండు బ్యారేజ్ లలో కూడా నీటిని ఖాళీ చేయాలని సూచించింది. అథారిటీ సూచన మేరకే రాష్ట్ర ప్రభుత్వం నీటిని ఖాళీ చేస్తుందన్నారు.

అంతేకాకుండా..’ ఈ విషయంలో బిఆర్ఎస్ రాజకీయాలు చేస్తూ నీటిని నింపాలని డిమాండ్ చెయ్యడం అత్యంత బాధ్యత రాహిత్యం. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం. సుందిళ్ల బ్యారేజీల డిజైన్లు నిర్మాణాన్ని పరిశీలించేందుకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీని నియమించింది. కేంద్ర జల సంఘం మాజీ ఛైర్మన్ జె.చంద్రశేఖర్ అయ్యర్ సారధ్యంలో అయిదుగురు సభ్యులతో కమిటీని నియమించింది. ఇందులో యు.సి. విద్యార్థి, ఆర్.పాటిల్, శివకుమార్ శర్మ, రాహుల్ కుమార్ సింగ్ సభ్యులుగా నియమించింది. ఎన్డీఎస్ఏ డైరెక్టర్ (టెక్నికల్) అమితాబ్ మీనా ఈ కమిటీకి మెంబర్ సెక్రెటరీగా వ్యవహరిస్తారు. మేడిగడ్డ బ్యారేజీలోని ఫియర్లు కుంగిపోవటంతో అప్రమత్తమైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం. సుందిళ్ల బ్యారేజీలపై సమగ్రంగా విచారణ జరపాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి లేఖ రాసింది. మూడు బ్యారేజీల డిజైన్లతో పాటు నిర్మాణాలను నిపుణుల అధ్వర్యంలో అన్ని కోణాల్లో పరిశీలించాలని ఎన్డీఎస్ఏ విజ్ఞప్తి చేసింది. స్పందించిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఈ మూడు బ్యారేజీలపై కమిటీని నియమిస్తూ మార్చి 2వ తేదీ శనివారం రోజున ఉత్తర్వులు జారీ చేసింది.

బ్యారేజీలను పరిశీలించి, కుంగుబాటుకు, పగుళ్లకు కారణాలను విశ్లేషించాలని, ఇప్పుడున్న పరిస్థితుల్లో చేపట్టాల్సిన ప్రత్యామ్నాయాలను సిఫారసు చేయాలని ఈ కమిటీకి సూచించింది. నాలుగు నెలల్లోపు తమ రిపోర్టును అందజేయాలని కమిటీకి నిర్ణీత గడువును విధించింది. బీఆర్ఎస్ నాయకులకు ఎలాంటి సాంకేతిక అవగాహన లేకున్నా మాట్లాడడం దురదృష్టకరం.. కాళేశ్వరం ప్రాజెక్టులో గత ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. నాణ్యత, నిర్వహణ, నిర్మాణం, డిజైన్లు, అన్ని విషయాలల్లో గత ప్రభుత్వం నిబంధనలను తుంగలో తొక్కింది. 94 వేల కోట్ల వ్యయం చేసిన ఈ ప్రాజెక్టులో మెడిగడ్డ బ్యారేజ్ గుండెకాయ లాంటిది.. బీఆర్ఎస్ నాయకుల మాటలకు విలువ లేదు.. కాళేశ్వరం ప్రాజెక్టు లో గుండెకాయ లాంటి మెడిగడ్డ కుంగిపోతే ఆవేదన వ్యక్తం చేయాల్సిన బిఆర్ఎస్ నాయకులు ఒక్క పిల్లర్ కుంగిపోయిందని మాట్లాడ్డం అత్యంత దురదృష్టకరం.. బీఆర్ఎస్ నాయకులు బాద్యత రహితంగా రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను, రైతాంగ ప్రయోజనాలను పణంగా పెట్టడం దురదృష్టకారం.. రాష్ట్ర ప్రభుత్వం డ్యామ్ సెఫిటీ అథారిటీ, నిపుణుల కమిటీ సూచనలను మాత్రమే పాటిస్తుంది.’ అని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.