
ఎప్పటిలాగే ఈ సీజన్ లో కూడా కోటీ ఆశలతో ఐపీఎల్ బరిలోకి దిగబోతుంది సన్రైజర్స్. వన్డే ప్రపంచకప్ విజేతగా నిలిపిన కమిన్స్ను ఏకంగా రూ.20.5 కోట్లకు దక్కించుకుని మరీ టీం క్రేజ్ పెంచిన వార్నర్, విలియమ్సన్ ను పక్కన పెట్టి కొత్త కెప్టెన్ కమిన్స్ సారథ్యంలో బరిలోకి దిగనుంది. ఆసీస్ను ప్రపంచ టెస్టు ఛాంపియన్ గా నిలపడంతో కమిన్స్ పైనే టీం మానేజ్మెంట్ ఆశలు పెట్టుకుంది. మరోవైపు గడిచిన 3 సీజన్లలో అత్యంత దారుణ ప్రదర్శన కనపరిచింది సన్రైజర్స్. దాంతో ఈ సారైనా టైటిల్ గెలవాలని అభిమానులు గట్టిగా ఆశిస్తున్నారు.
మరి ఈ సారి విదేశీ, స్వదేశీ క్రికెటర్ల సత్తాతో రెడీ అయన ఈ ఆరెంజ్ ఆర్మీ టీంకు కొత్త కెప్టెన్ ఎలాంటి రిజల్ట్ ను అందిస్తాడా అనేది వేచి చూడాల్సిందే. ఇక టీం బలాల విషయానికొస్తే.. విదేశీ ఆటగాళ్లు సన్రైజర్స్ కు కొండంత బలమనే చెప్పాలి. టీం కెప్టెన్ కమిన్స్ తో పాటు మార్క్రమ్, ట్రావిస్ హెడ్, క్లాసెన్, గ్లెన్ ఫిలిప్స్, హసరంగ, యాన్సెన్, ఫజల్ హక్ ఫరూఖీ లాంటి విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. కమిన్స్ ప్రస్తుతం ఫామ్ లో ఉండడంతో.. పేస్ బౌలింగ్ తో, బ్యాటింగ్ తో సత్తాచాటగలడు. ఎవరికీ కూడా అతడి కెప్టెన్సీ పై సందేహాలు లేవు. హెడ్, మార్క్రమ్, క్లాసెన్, ఫిలిప్స్ కూడా ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాలను మార్చగలరు. పేసర్ యాన్సెన్, స్పిన్నర్ హసరంగ అయితే బాల్ తోపాటు బ్యాట్ తోనూ అద్భుతంగా రాణించగలరు.
వీరితోపాటు టీంలో భారత బౌలర్ల స్థానం బలంగా ఉంది. ముఖ్యంగా పేస్ త్రయం నటరాజన్, భువనేశ్వర్, ఉమ్రాన్ కాస్త మంచి ప్రదర్శన చేస్తే జట్టుకు తిరుగుండదనే చెప్పాలి. ఇక భారత ఆటగాడు వాషింగ్టన్ సుందర్ కూడా మంచి స్పిన్ ఆల్రౌండరే. ఇక బలహీనతల విషయానికొస్తే.. టీంలో ఉన్న భారత ప్లేయర్స్ కాస్త ఫామ్ లో లేరని చెప్పొచ్చు. ముఖ్యంగా జట్టులో సమష్టితత్వం లేదనిపిస్తోంది. ముఖ్యంగా జట్టుకు వార్నర్, విలియమ్సన్, మార్క్రమ్ ఇంకా ఒకరితర్వాత ఒకరు అంటూ వరుసగా కెప్టెన్లను మార్చడం కూడా జట్టుకు ఓ మైనస్ అనే చెప్పాలి. కాబట్టి అనేక అంచనాల ఒత్తిడిని కమిన్స్ ఎలా అధిగమిస్తాడో చూడాలి మరి.