- వందేళ్లలో రాని వరద వచ్చింది
- ఖమ్మం జిల్లాలో 48000 ఎకరాల వరకు పంట నష్టం
- వరద బాధితులకు సాయం అందిస్తున్నామన్న మంత్రి తుమ్మల

Minister Thummala Nageswara Rao: కాంగ్రెస్ పార్టీ హామీ మేరకు రుణమాఫీ చేశామని.. 22 లక్షల రైతుల ఖాతాల్లో రూ. 18 వేల కోట్లు జమ చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఇంకా మరి కొంతమంది రైతులకు రుణమాఫీ చేస్తామని మంత్రి తెలిపారు. ఈ సంతోష సమయంలో వరదల రూపంలో ఉపద్రవం వచ్చి పడిందని ఆయన పేర్కొన్నారు. మున్నేరు నదికి భారీ వరద వచ్చిందని.. వందేళ్లలో రాని వర్షం, వరద వచ్చినట్లు తుమ్మల చెప్పారు. ఇరిగేషన్ వ్యవస్థలు దెబ్బ తిన్నాయని తెలిపారు. ప్రస్తుతం పత్తి పూత మీద ఉందని, వరి చాలా వరకు దెబ్బతిందని.. అధికారులను నష్టంపై సర్వే చేయమని ఆదేశించామన్నారు.
ఎక్కువగా ఖమ్మం జిల్లాలో ఆ తరువాత సూర్యాపేట, మహబూబాబాద్లో నష్టం జరిగిందన్నారు. ఖమ్మం జిల్లాలో 48000 ఎకరాల వరకు పంట నష్టం జరిగినట్లు ప్రాథమిక సమాచారం మేరకు తెలిసిందన్నారు. రైతులు పంటలు వేసుకునేందుకు విత్తనాలు సిద్ధంగా ఉంచామన్నారు. ఎరువులు కూడా సిద్ధంగా ఉన్నాయన్నారు. ఐదు రోజుల పాటు జిల్లాలోనే ఉన్నానని మంత్రి తెలిపారు. మున్నేరు పల్లపు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయన్నారు. అన్ని ప్రాంతాల్లో వరద బాధితులకు మంచి నీళ్లు, బియ్యం, వంట సామాగ్రి, పాలపాకెట్లు పంపిణీ చేస్తున్నామన్నారు. టెస్కో ద్వారా రెండు జతల బట్టలు, దుప్పట్లు బాధిత కుటుంబాలకు సరఫరా చేయనున్నామని వెల్లడించారు. ఇళ్లను కోల్పోయిన వారికి మళ్లీ ఇళ్లు ఇచ్చే కార్యక్రమం చేపడతామన్నారు. ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా ప్రజల కోసమే పని చేశానన్నారు.