- ఏడుపాయల ఆలయం గర్భగుడిలోకి ప్రవేశించిన మంజీరా వరద
- అమ్మవారి ఆలయాన్ని చుట్టుముట్టిన మంజీరా ఏడు పాయలు

Manjira River: మెదక్ జిల్లాలోని ఏడు పాయల ఆలయం వద్ద మంజీరా నది ఉగ్రరూపం దాల్చింది. అమ్మవారి గర్భగుడిలోనికి మంజీరా వరద ప్రవేశించింది. మంజీరా బ్యారేజ్ గేట్లు ఓపెన్ చేయడంతో భారీగా వరద వచ్చింది. అమ్మవారి ఆలయాన్ని మంజీరా ఏడు పాయలు చుట్టుముట్టాయి. గర్భగుడి మూసేయడంతో రాజగోపురంలో ఉత్సవ విగ్రహానికి అమ్మవారు పూజలు అందుకుంటున్నారు.
గత కొన్ని రోజులుగా భారీగా వర్షాలు కురవడంతో మంజీరా బ్యారేజ్ నిండుకుండలా మారగా.. గేట్లను ఓపెన్ చేశారు. ఈ క్రమంలోనే మెదక్లోని ఏడుపాయల వనదుర్గా భవాని ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఇప్పటికే అమ్మవారి ఆలయం చుట్టూ మంజీరా నది ఉగ్రరూపం దాల్చింది. అమ్మవారి పాదాలను తాకుతూ ఏడు పాయలుగా చీలిపోయి ఆలయం ఎదుట పరవళ్లు తొక్కుతోంది. వరద ఉధృతి తగ్గిన తర్వాత యధావిధిగా భక్తులకు దర్శనం కల్పిస్తామని ఆలయ ఈవో తెలిపారు. వరదల కారణంగా మంజీరాలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు వనదుర్గ ప్రాజెక్టు వైపు వెళ్లకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.