Leading News Portal in Telugu

Eatala Rajendar Serious Warning To CM Revanth Reddy


  • దుండిగల్ లో అసైన్డ్ భూముల వద్ద రైతుల ఆందోళన..

  • బాధితులకు అండగా నిలిచిన ఎంపీ ఈటల రాజేందర్..

  • ఈ భూమి మీ తాత జాగీరు కాదంటూ ముఖ్యమంత్రికి ఈటల హెచ్చరిక..
Eatala Rajendar: దుండిగల్లో అసైన్డ్ భూముల ఆందోళన.. అధికారులపై ఎంపీ ఈటల ఫైర్

Eatala Rajendar: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్ మున్సిపాలిటీ దుండిగల్ గ్రామంలో సర్వే నెంబర్ 453, 454 లలో ఉన్న లవాణి పట్టా 450 ఎకరాల భూమిలో కొంత స్థలంలో డబుల్ బెడ్ రూమ్స్ నిర్మించారు. మిగతా 410 ఎకరాల్లో ఉన్న రైతులకు ఎలాంటి నష్ట పరిహారం ఇవ్వకుండ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సర్వే నంబర్లలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 600 మందికి 60 గజాల ఇందిరమ్మ పట్టాలు కూడా ఇచ్చింది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఈ భూమికి పట్టాలు ఇప్పిస్తామని రేవంత్ రెడ్డి హామీ కూడా ఇచ్చారనీ.. ఇప్పుడు లాక్కొనే ప్రయత్నం చేస్తున్నారనీ.. తెలియడంతో అక్కడికి వెళ్ళిన బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ రైతులకు అండగా నిలిచారు.

ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ఈ భూముల్లో 40 ఏళ్లుగా వ్యవసాయం చేసుకుంటున్నారు.. ఈ భూముల్ని ఇష్టం వచ్చినట్టు తీసుకోవచ్చని అధికారులు చెప్తున్నారు.. ఏమనుకుంటున్నారు?.. కేసీఆర్ ప్రభుత్వం కూడా ఇలానే చేసి నాశనం అయింది.. అసైన్డ్ భూములను ఇష్టం వచ్చినట్లు లాక్కొనే అధికారం ఎవరికి లేదు.. రింగ్ రోడ్డు అప్పుడు కూడా ఇలానే అసైన్మెంట్ భూములకు రూపాయి ఇవ్వకుండా గుంజుకుంటుంటే రాజశేఖర్ రెడ్డితో కొట్లాడాం.. పట్టా భూములతో సమానంగా అసైన్డ్ భూములకు కూడా నష్టపరిహారం ఇచ్చే వరకు వదిలి పెట్టలేదని చెప్పారు. ప్రభుత్వానికి అవసరమైతే అది కూడా ప్రజల కోసం అయితే నష్ట పరిహారం ఇచ్చి తీసుకోవాలి.. ప్రభుత్వం రియల్ ఎస్టేట్ బ్రోకర్ కాదు.. గద్దల్లాగా వచ్చి ప్రజల్ని అదరగొట్టి బెదరగొట్టి పోలీసుల సహాయంతో పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మంచిగా ఉండదు.. నేను ఇక్కడ ఎంపీగా ఉన్నా.. అసైన్డ్ భూములు ఒక్క సంవత్సరం కోసం ఇవ్వరు.. తాత జాగీర్ లాగా ప్రజలను ఇబ్బంది పెట్టవద్దు అని ఈటల రాజేందర్ మండిపడ్డారు.

ఇక, అవసరమైతే ప్రజల తరపున నేనే కోర్టుకు పోతాను అని ఈటల రాజేందర్ తెలిపారు. దద్దమ్మల లెక్క ఉంటే గద్దల లెక్క తనకు పోతారు.. అనేక రాష్ట్రాల్లో15 ఏళ్లు దాటిన తర్వాత అసైన్డ్ భూములపై సంపూర్ణ హక్కులు ఇచ్చేస్తారు.. తమిళనాడు, యూపీలో ఇలాగే చేశారు.. కేసీఆర్ కూడా ఇస్తానని ఇవ్వలేదు.. కడు బీదరికంలో ఉన్న వారికి ఈ భూమి ఇచ్చారు.. రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా వ్యవహరించమని కాదు మీకు ఓట్లు వేసింది.. నేను మీ వెంట ఉంటా.. భూములు గుంజుకుంటె చూస్తూ ఊరుకునేది లేదు.. పేదలను వేధించే అధికారం ఎవరికీ లేదు.. వారికి ఎవరూ దిక్కులేదని అనుకోవద్దు.. ఈ భూములు అమ్ముకుంటే రెస్యూమ్ చేయండి.. కానీ గుంజుకుంటా అంటే ఊరుకునేది లేదంటూ అధికారులపై మల్కాజ్ గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.