- జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మంత్రి శ్రీధర్ బాబు పర్యటన
-
పలు ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న మంత్రి -
రైతుల నుంచి ఎలాంటి ఇబ్బందులు రాకుండా మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయాలి-మంత్రి -
కేంద్రం ఇతర దేశాల నుంచి పత్తిన దిగుమతి చేయవద్దు- శ్రీధర్ బాబు -
మన దేశంలోనే సరిపడా పత్తి నిల్వలు ఉన్నాయి- మంత్రి.

కేంద్ర ప్రభుత్వం ఇతర దేశాల నుంచి పత్తిని దిగుమతి చేయవద్దని, మన దేశంలోనే సరిపడా పత్తి నిల్వలు ఉన్నాయని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. విదేశాల నుంచి పత్తి దిగుమతులను నిలిపివేసి రాష్ట్రంలో రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు చేపట్టాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి డిమాండ్ చేశారు. ఈ రోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించిన మంత్రి.. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి పలు ప్రారంభోత్సవాలు చేశారు. మల్హర్ మండలంలోని కొండంపేట గ్రామంలో పీఏసీఎస్ వరి ధాన్య కొనుగోలు కేంద్రం, సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రం, కాటారం మండలం కేంద్రంలో మీనాక్షి కాటన్ ఆగ్రో ఇండస్ట్రీస్ను మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. దొడ్డు రకం, సన్న రకం తేడాను స్పష్టంగా తెలియజేసేలా కొనుగోలు కేంద్రాల ఇంచార్జిలు, క్షేత్రస్థాయి సిబ్బంది అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. జిల్లాలో ఉన్న మిల్లుల నుంచి బ్యాంకు గ్యారంటీ సమర్పిస్తామని.. అండర్ టేకింగ్ ఆఫిడవిట్ తీసుకొని ధాన్యం కేటాయింపులు చేయాలని పేర్కొన్నారు. రైస్ మిల్లర్లు తాలు పేరుతో రైతులకు కోతలు పెట్టవద్దని సూచించారు. సన్న రకం ధాన్యంపై ప్రభుత్వం ప్రకటించిన 500 రూపాయల బోనస్ అర్హులైన ప్రతి రైతుకు అందాలని అన్నారు. జిల్లా సరిహద్దులో పటిష్ట పర్యవేక్షణ చేయాలని.. ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం మన జిల్లాకు రాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యానికి రైతులకు సకాలంలో చెల్లింపులు చేయాలని పేర్కొన్నారు.
సన్న రకం ధాన్యం క్రింద ఏ రకం ధాన్యాన్ని పరిగణిస్తున్నామనే అంశంపై రైతులకు స్పష్టంగా తెలిసేలా విస్తృత ప్రచారం కల్పించాలని అధికారులకు తెలిపారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతుల నుంచి ఎలాంటి ఇబ్బందులు రాకుండా మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయాలని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.