- పసికందును కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన మహిళ అరెస్ట్
-
కోఠి ప్రభుత్వ ప్రసూతి హాస్పిటల్ లో అప్పుడే పుట్టిన పసికందు -
కిడ్నాప్ చేసేందుకు యత్నించిన అస్కారి బేగం (45) -
ఓ గుర్తు తెలియని వ్యక్తి తమకు మగ బిడ్డను ఇస్తే.. -
రూ. 50 వేల ఇస్తానని ఆస్కారి బేగంతో ఒప్పందం.

పసికందును కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన హైదరాబాద్లోని కోఠి ప్రభుత్వ ప్రసూతి హాస్పిటల్లో జరిగింది. అప్పుడే పుట్టిన పసికందును కిడ్నాప్ చేసేందుకు యత్నించిన మహిళను సుల్తాన్ బజార్ పోలీసులు అరెస్ట్ చేశారు. రెయిన్ బజార్ నెహ్రూ నగర్ ప్రాంతానికి చెందిన అస్కారి బేగం(45)ఇండ్లలో పనిమనిషి పని చేస్తూ జీవనం సాగిస్తుంది. అయితే.. తన కూతురు ఫాతిమా బేగం ప్రసవం నిమిత్తం కోఠిలోని సుల్తాన్ బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రికి వచ్చింది.
ఓ గుర్తు తెలియని వ్యక్తి తమకు మగ బిడ్డను ఇస్తే.. 50 వేల రూపాయలను ఇస్తానని ఆస్కారి బేగంతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ క్రమంలో.. ఈనెల 5న ఉన్నిసా బేగంకు జన్మించిన పసి కందును ఎత్తుకెళ్లేందుకు యత్నించింది. అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది గమనించి.. ఆమెను బెదిరించి అక్కడి నుంచి పంపించారు. మరుసటి రోజు ఆసుపత్రికి వచ్చి అనుమాస్పదంగా తిరుగుతుండడంతో.. సెక్యూరిటీ సిబ్బంది ఆమెను పట్టుకొని సుల్తాన్ బజార్ పోలీసులకు అప్పగించారు. ఈ క్రమంలో.. ఆ మహిళపై కేసు నమోదు చేసిన పోలీసులు.. రిమాండ్ కు తరలించారు. గతంలో ఆస్కారి బేగంపై 9 పోలీస్ స్టేషన్లలో ఇదే తరహా కేసులు నమోదు అయినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.