Leading News Portal in Telugu

ఏం చెప్పినా చప్పట్లు కొట్టాలా ?… కేసీఆర్‌పై మండిపడ్డ రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ నేత, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ ఏం చెప్పినా చప్పట్లు కొట్టాలా అని ప్రశ్నించారు. ఏప్రిల్ ఏడు తర్వాత కరోనా ఉండదన్న కేసీఆర్… తాజాగా జూన్ మూడు అంటున్నారని విమర్శించారు. కరోనాపై కేసీఆర్ ఎన్నిసార్లు మాటమార్చారో చూసుకుంటే… ఆయనకే సిగ్గేస్తుందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కరోనాపై మంచి సలహాలు ఇచ్చినోళ్లకు కరోనా రావాలని కేసీఆర్ కోరుకుంటున్నారని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. తన తప్పుడు పనులను ప్రశ్నించే వాళ్లకు కరోనా రావాలని కేసీఆర్ కోరుకుంటున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు.

కరోనా వ్యాప్తికి పరోక్షంగా కేసీఆరే బ్రాండ్ అంబాసిడర్‌గా మారారని ఎద్దేవా చేశారు. తప్పుడు ప్రచారాలు చేస్తోన్న కేసీఆర్ పై డీజీపీ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. మొదట్లో కరోనా వస్తే పారాసిటమల్ వేసుకుంటే సరిపోతుందన్న కేసీఆర్… ఇప్పుడు అది భయంకరమైన రోగం అంటున్నారని గుర్తు చేశారు. ఒక ముఖ్యమంత్రి నోటికొచ్చినట్టు మాట్లాడటమేంటని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కరోనా పై రోజూ ప్రధాని మోడీతో మాట్లాడుతానంటున్న సీఎం కేసీఆర్… తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షాన్ని మాత్రం ఎందుకు సంప్రదించడం లేదని రేవంత్ రెడ్డి నిలదీశారు.

ప్రైవేటు వైద్య వ్యవస్థలను ప్రభుత్వం ఎందుకు వాడుకోవడం లేదని రేవంత్ రెడ్డి కేసీఆర్‌ను ప్రశ్నించారు. అన్నీ తనకే తెలిసినట్టు సీఎం కేసీఆర్ బుర్ర లేకుండా వ్యవహరించవద్దని రేవంత్ రెడ్డి సూచించారు. ఇది విమర్శించడానికి సమయం కాదని సంయమనం పాటిస్తున్నామని స్పష్టం చేశారు. రోజువారీ కూలీలకు కనీస వసతులు కల్పిస్తే వాళ్లు రోడ్లపైకి రారని రేవంత్ రెడ్డి అన్నారు. లాక్ డౌన్ కొనసాగించాలనుకుంటే దానికి తగ్గట్టుగా యంత్రాంగాన్ని సిద్ధం చేయాలని… అలా చేయకపోతే ప్రజల్లో అసహనం పెరుగుతుందని అన్నారు. పేదల కోసం రూ.వందల కోట్ల విరాళాలు వస్తున్నాయని… వాటన్నింటినీ వారికి అందేలా చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.