లాక్డౌన్ పొడిగింపుతో పాటు ఇవి కూడా అవసరం.. ప్రధానికి టీఆర్ఎస్ విజ్ఞప్తి
కరోనా వైరస్ను కట్టడి చేయాలంటూ లాక్డౌన్ను పొడిగించాల్సిందేనని ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తాజాగా ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్లోనూ ఇదే విషయం చెప్పారు టీఆర్ఎస్ ఎంపీలు. కరోనా వ్యాప్తిని భారతదేశంలో సమర్థవంతంగా నియంత్రించడానికి లాక్ డౌన్ పొడిగింపుకు మించిన మార్గంలేదని టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ప్రధానమంత్రి నరేంద్రమోడీకి స్పష్టంచేసింది. లాక్ డౌన్ ను కొనసాగించాలని కోరింది. భారత ప్రధాని నరేంద్ర మోడి బుధవారం పార్లమెంటులో అన్ని రాజకీయ పక్షాల నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో హైదరాబాద్ నుండి టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు డాక్టర్ కె. కేశవరావు, లోక్ సభ పక్ష నాయకుడు నామా నాగేశ్వర్ రావు పాల్గొన్నారు. టిఆర్ఎస్ పార్టీ వైఖరిని డాక్టర్ కేశవరావు ప్రధానమంత్రికి స్పష్టంగా తెలియచేశారు.
“ భారత ప్రభుత్వం, అన్ని రాష్ట్రాలు కలిసికట్టుగా పనిచేస్తూ దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి చేస్తున్న ప్రయత్నాలు ఎంతో బాగున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి 24 గంటల పాటు కష్టపడుతున్నారు. లాక్ డౌన్ను కొనసాగించాలా వద్దా అన్నది మన మెదళ్ళలో ఉంది. కానీ నేను మాత్రం లాక్ డౌన్ను కొనసాగించాలని కోరుతున్నాను. లాక్డౌన్ వల్ల కష్టనష్టాలున్నప్పటికీ ఇది తప్పని చర్య. ఒకసారి పట్టువిడిస్తే పరిస్థితులు అధ్వాన్నంగా తయారవుతాయి. ఎక్కువ వైద్య సదుపాయాలు లేని గ్రామాలకు వైరస్ విస్తరిస్తే పరిస్థితి చేయి దాటి పోతుంది. ముందు ఈ బాధ నుండి విముక్తి లభిస్తే తరువాత ఏమైనా చేసుకోవచ్చు. మన ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉందనే విషయం మాకూ తెలుసు. కానీ మానవ మనుగడను పణంగా పెట్టి ఆర్థిక వృద్ధిని ప్రాధాన్యంశంగా చూడవద్దు” అని కేశవరావు కోరారు.
లాక్డౌన్ పొడిగింపులతో పాటు మరికొన్ని సూచనలు చేశారు కేశవరావు. అభివృద్ధి చెందిన దేశాల జిడిపిలో సపోర్ట్ ప్యాకేజ్ 10 శాతం ఉంటే, మనకు కేవలం 1 శాతమే ఉందిని..దీన్ని పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. వడ్డీ రేట్లను మరింత తగ్గించాలని మోదీకి విజ్ఞప్తి చేశారు కేకే. రాష్ట్రాలకు కావాల్సిన నిధులను అందించడంతో పాటు పాత బకాయిలను కూడా చెల్లించాలని సూచించారు. కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలకు మా మద్దతు ఉంటుందని.. ఐతే కేవలం pmo ద్వారానే నిర్ణయాలు తీసుకుంటే మంచి ఫలితాలు రావాన్నారు టీఆర్ఎస్ ఎంపీలు. వికేంద్రీకరణ కూడా ముఖ్యమని ప్రధానికి సూచించారు. లాక్డౌన్తో రాబడి పూర్తిగా పడిపోయిందని.. ఈ నేపథ్యంలో తమకు మరిన్ని నిధులు సమకూర్చాలని కోరారు. సంఘటితంగా పోరాడితేనే కరోనా వైరస్ను సమర్థంగా ఎదుర్కోగలమని అభిప్రాయపడ్డారు.