Leading News Portal in Telugu

85శాతం కేసులు అవే.. కేంద్రమంత్రి హర్షవర్ధన్ వీడియో కాన్ఫరెన్స్‌లో ఈటల

తెలంగాణలో నమోదైన కరోనా కేసుల్లో 85శాతం మర్కజ్ నుంచి వచ్చినవేనన్నారు తెలంగాణ మంత్రి ఈటల. రాష్ట్రంలో కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ జరగలేదని స్పష్టం చేశారు. కేంద్ర ఆరోగ్య,కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్షవర్ధన్ రాష్ట్రాల వైద్య ఆరోగ్యశాఖ మంత్రులతో నిర్వహించిన విడియో కాన్ఫరెన్స్ లో హైదరాబాద్ BRKR భవన్ నుండి తెలంగాణ వైద్యఆరోగ్యశాఖమంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. రాష్ట్రం, దేశంలో తయారవుతున్న మందులు, వైద్య పరికరాలపై టాక్స్ ఎత్తివేయాలని ఆయన కేంద్రాన్ని కోరారు. అదేవిధంగా విదేశాల నుండి దిగుమతి చేసుకొనే వైద్య పరికరాలను కస్టమ్స్, టాక్స్ రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు.

ECIL, DRDO లాంటి కేంద్రప్రభుత్వరంగ సంస్థల్లో వెంటిలేటర్‌లు, ఇతర వైద్య పరికరాలు తయారుచేసి రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేయాలని మంత్రి ఈటల కోరారు. అంతేకాదు N-95 మాస్కులు, PPE కిట్స్, టెస్టింగ్ కిట్స్ సాధ్యమైనంత త్వరగా అందజేయాలని విజ్ఞప్తి చేశారు. వైద్య పరికరాలు మరియు కరోనా నియంత్రణ కోసం వినియోగిస్తున్న వాటిని బ్లాక్ మార్కెట్ చేయకుండా నియంత్రించాలని, కేంద్ర ప్రభుత్వమే సేకరించి రాష్ట్రాలకు అందించాలన్నారు మంత్రి ఈటల.

తెలంగాణలో వచ్చిన పాజిటివ్ కేసుల్లో 85% మర్కజ్ నుండి వచ్చినవే, ఇవి తగ్గితే కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని కేంద్ర మంత్రికి మంత్రి ఈటల రాజేందర్ వివరించారు. తెలంగాణలో ఇప్పటికీ 8500 మందికి పరీక్షలు చేస్తే 471 మందికి పాజిటివ్ అని తేలింది. 45 మంది కోలుకొని డిశ్చార్జ్ అవ్వగా , 12 మంది చనిపోయినట్లు తెలిపారు. లాక్ డౌన్ పొడిగించే అంశంపై అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోవాలని కూడా మంత్రి సూచించారు. శుక్రవారం మరో 60-70 మంది డిశ్చార్జి అయ్యే అవకాశముందని.. ప్రస్తుతం ఉన్న రోగులంతా ఏప్రిల్ 22 వరకు డిశ్చార్జి అవుతారని ఈటల రాజేందర్ ఇప్పటికే చెప్పారు. రానున్న రోజుల్లో తెలంగాణలో కొత్త కేసులు నమోదు కాకపోవచ్చని.. ఐనప్పటికీ అందరూ సామాజిక దూరం పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.