లుంగీలను కిటికీ ఊచలకు కట్టి.. తప్పించేందుకు ప్రయత్నించిన వలస కార్మికులు
కుటుంబ సభ్యులపై బెంగతో ఓ పదిమంది వలస కార్మికులు పునరావాస కేంద్రం నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. అదీ కూడా ఆషామాషీగా కాదు.. కిటికీలకు లుంగీలు కట్టి మూడో అంతస్థు నుంచి దిగి పారిపోతుండగా, పోలీసులు పట్టుకున్నారు. పూర్తి వివరాలకు వెళితే.. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి పట్టణం గద్దెరాగడి గురుకుల పాఠశాలలోని పునరావాస కేంద్రంలో వసల కూలీలను ఉంచారు. లాక్డౌన్ నిబంధనల వల్ల స్వస్థలాలకు వెళ్లలేకపోవడం.. కుటుంబ సభ్యులపై బెంగతో మధ్యప్రదేశ్, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన 10 మంది వలస కూలీలు పునరావాస కేంద్రం నుంచి తప్పించుకునేందుకు ప్రణాళిక వేశారు.
శుక్రవారం తెల్లవారుజామున 4.30 గంటలకు లుంగీలను కిటికీ సువ్వలకు కట్టి మూడో అంతస్థు నుంచి కిందకు దిగి పారిపోయేందుకు ప్రయత్నించారు. పునరావాస కేంద్రానికి కాపలాగా ఉన్న రెవెన్యూ ఉద్యోగి వీరిని గమనించి పోలీసులకు సమాచారమిచ్చాడు. పునరావాస కేంద్రం నుంచి బయటకు వెళ్లి సోమగూడెం రాష్ట్రీయ రహదారిపై నడుస్తూ వెళుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీలు చేపట్టి వారిని పట్టుకున్నారు. వలస కూలీలను పునరావాస కేంద్రానికి తరలించి కౌన్సెలింగ్ నిర్వహించారు.