రక్తదానం చేసిన సైబరాబాద్ పోలీసులు… ఆ దిశగా మరో కీలక నిర్ణయం
సైబరాబాద్ పోలీసులు రక్తదానానికి శ్రీకారం చుట్టారు. పోలీసులు, వాలంటీర్లు, ఇతర సిబ్బంది కలిసి 52 యూనిట్ల రక్తాన్ని దానం చేశారు. శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి స్వయంగా రక్తదానం చేసి ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. చల్లా ఆస్పత్రి, రోటరీ క్లబ్ బ్లడ్ బ్యాంక్ వారు ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రక్తదానం చేయాలని భావించే వారెవరైనా సైబరాబాద్ కోవిడ్ కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్లు 9490617440 లేదా 9490617431కి కాల్ చేసి వారి పేరు రిజిష్టర్ చేసుకోవాలని పోలీసులు సూచించారు. వారిని రక్తదాన శిబిరానికి తీసుకురావడంతో పాటు మళ్లీ వారిని ఇంటి దగ్గర డ్రాప్ చేసే బాధ్యతను కూడా పోలీసులే తీసుకుంటారని ఆయన తెలిపారు.
ఒకరు రక్తదానం చేయడం వల్ల ముగ్గురి ప్రాణాలు కాపాడిన వారవుతారని సైబరాబాద్ పోలీసులు తెలిపారు. ఆర్బీసీ, ప్లాస్మాతో పాటు ప్లేట్లెట్లు బాధితులకు అందుతాయని అన్నారు. కరోనా వైరస్ కారణంగా అన్ని బ్లడ్ బ్యాంకుల్లో రక్తానికి తీవ్ర కొరత ఏర్పడింది. దీంతో రక్తం ఎక్కువగా అవసరం ఉండే తలసేమియా, క్యానర్స్ పేషెంట్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాధారణంగా తలసేమియా పేషెంట్లకు నెలకు రెండు సార్లు రక్తం ఎక్కించాల్సి ఉంటుంది.