Leading News Portal in Telugu

తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు గుడ్ న్యూస్…

తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా కష్ట కాలంలోనూ గ్రామ పంచాయతీలకు రూ. 307 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇబ్బందులు ఉన్నప్పటికీ.. మార్చి నెలకు సంబంధించి గ్రామ పంచాయతీలకు రూ. 307 కోట్లు సీఎం కేసీఆర్‌ మంజూరు చేశారని మంత్రి తెలిపారు. ఈ నిధుల్లో ఒక్క పైసా కూడా వృథా కావొద్దని గ్రామాల సర్పంచ్‌లు, అధికారులను మంత్రి ఆదేశించారు. పల్లెల అభివృద్ధి, పారిశుద్ధ్యంతో పాటు కరోనా నిర్మూలనకు ఈ నిధులు ఖర్చులు చేయాలని సూచించారు.

ప్రతి గ్రామంలో ప్రతి రోజూ పారిశుద్ధ్య పనులు నిర్వహించాలన్నారు. పారిశుద్ధ్యం పనులు చేయించకపోతే అధికారులపై చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎప్పటికప్పుడు డ్రైనేజీలను, వీధులను శుభ్రం చేయాలని ఆదేశించారు. పారిశుద్ధ్య ర‌సాయ‌నాలు, ప‌రికాల కొర‌త లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. మంజూరైన నిధుల‌ను గ్రామ పంచాయితీల వారీగా కేటాయిస్తార‌ని, ఆయా నిధుల్లోంచి ముందుగా పెండింగ్ క‌రెంటు బిల్లులను చెల్లించాల‌ని అన్నారు. , త‌ద్వారా ప్రభుత్వం నిరాటంకంగా అందిస్తున్న 24 గంట‌ల విద్యుత్ స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం లేకుండా స‌హ‌క‌రించాల‌ని ఆదేశించారు.