Leading News Portal in Telugu

రోడ్ల మీదకు వస్తే ఇవి మస్ట్.. తెలంగాణలో లాక్‌డౌన్ మరింత కఠినం

భారత్‌లో రోజు వెయ్యికి పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఐనప్పటికీ చాలా మంది ఇంకా లాక్‌డౌన్‌ను సీరియస్‌గా తీసుకోవడం లేదు. ఇష్టానుసారం రోడ్ల మీదకు వస్తున్నారు. గుంపులు గుంపులగా మార్కెట్లకు వెళ్తున్నారు. కొందరు వాహనదారులు పాస్‌లను దుర్వినయోగం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం నుంచి లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేస్తామని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. వాహనదారులకు ఇచ్చిన పాసులను సమీక్షిస్తామని.. ఉల్లంఘనకు పాల్పడిన వారి పాసులను రద్దు చేస్తామని తెలిపారు. ఇకపై రోడ్ల మీదకు వచ్చే వారంతా రెసిడెన్స్ ప్రూఫ్‌తోనే బయటకు రావాలని స్పష్టం చేశారు డీజీపీ.

తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం.. రాష్ట్రంలో ఆదివారం రాత్రి వరకు 858 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వారిలో కరోనా వైరస్‌తో పోరాడుతూ 186 మంది కోలుకోగా… మరో 21 మంది చనిపోయారు. ఆదివారం ఒక్క రోజే తెలంగాణలో 49 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. ముగ్గురు చనిపోయారు. కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో తెలంగాణలో లాక్‌డౌన్‌ను మే7 వరకు పొడిగిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. వ్యసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, అత్యవసర సేవలు మినహా ఎక్కడా ఎవరికీ మినహాయింపులు ఉండవని.. లాక్‌డౌన్ యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు