తెలంగాణలో కరోనా తగ్గుముఖం… ఇవాళ కొత్తగా ఆరు కేసులు
తెలంగాణలో కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. రాష్ట్రంలో నేడు కొత్తగా ఆరు కేసులు నమోదయ్యాయని ఆయన తెలిపారు. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 1009కు చేరిందని వెల్లడించారు. ఈ రోజు కొత్తగా నమోదైన కేసులన్నీ జీహెచ్ఎంసీ పరిధిలోనివే అని ఈటల రాజేందర్ అన్నారు. ఈ రోజు రాష్ట్రంలో కొత్తగా 42 మంది డిశ్చార్జ్ అయ్యారని వివరించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 374గా ఉందని అన్నారు. ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య 610 మంది ఉన్నారని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.
తెలంగాణలో ఇప్పటివరకు కరోనా కారణంగా 25 మంది చనిపోయారని అన్నారు. తెలంగాణలో కరోనా డేంజర్ లేని జిల్లాలు 22 ఉన్నాయని తెలిపారు.ఇవన్నీ గ్రీన్ జోన్ పరిధిలోకి వచ్చే అవకాశం ఉందని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోందని ఐసీఎంఆర్ ప్రకటించిందన్న ఈటల…తెలంగాణలో మాత్రం కేసులు సంఖ్య తగ్గుతోందని అన్నారు. తెలంగాణలో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యల పట్ల కేంద్రం సంతృప్తి వ్యక్తం చేసిందని… కేంద్ర ఆరోగ్యమంత్రి సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు చెప్పమని చెప్పారని ఈటల రాజేందర్ అన్నారు.