Leading News Portal in Telugu

అకాల వర్షాలు.. తెలంగాణలో మరో 3 రోజుల పాటు వానలు

మంగళవారం కురిసిన భారీ వర్షానికి తెలుగు రాష్ట్రాల రైతులు తీవ్రంగా నష్టపోయాయి. వడగళ్ల వానతో చేతికొచ్చిన పంట ధ్వంసమైంది. మార్కెట్‌కు వచ్చిన ధాన్యం నాశనమైంది. దాని నుంచి తేరుకోకముందే.. హైదరాబాద్ వాతావరణ కేంద్రం మరో పిడుగులాంటి వార్త చెప్పింది. తెలంగాణలో రాగల మూడు రోజుల్లో వానలు కురుస్తాయని తెలిపింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకులు చెప్పిన వివరాల ప్రకారం.. దక్షిణ చత్తీస్‌గఢ్ మరియు దాని పరిసర ప్రాంతాల్లో 1.5 కి.మీ. ఎత్తున ఉపరితల ఆవర్తన కొనసాగుతోంది. నైరుతి మధ్యప్రదేశ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు పశ్చిమ విదర్భ, ఉత్తర మధ్య మహారాష్ట్ర, మరఠ్వాడ, ఇంటీరియర్ కర్నాటక మీదుగా 0.9 ఎత్తున ఉపరిత ద్రోణి కొనసాగుతోంది.

అంతేకాదు ఉత్తర సుమత్రా పరిసర ప్రాంతాల్లో 3.6 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తన కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాగల 48 గంటల్లో దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముంది. తదుపరి 48 గంటల్లో అది వాయుగుండంగా బలపడే అవకాశముంది. అనంతరం ఉత్తర వాయువ్యదిశలో ప్రయాణించి.. తదుపరి ఈశాన్య దిశగా మే 1-3 మధ్య మయన్మార్-బంగ్లాదేశ్ తీరం వైపు ప్రయాణించే అవకాశముంది.

దీని ప్రభావంతో ఇవాళ, రేపు అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, వడగండ్లు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుంది. జగిత్యాల, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్,సిరిసిల్ల, కోమరంభీమ్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, జనగామ, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, యాదాద్రి, నల్గొండ, మహబూబ్ నగర్, సూర్యాపేట జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. ఎల్లుండి కూడా అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశముంది.