కూతురి పెళ్లి చేయలేకపోతున్నాననే బెంగతో తండ్రి ఆత్మహత్య
ఓ వైపు ఆర్థిక సమస్యలు.. మరోవైపు కూతురి పెళ్లి చేయలేకపోతున్నాననే బెంగ.. వెరసి ఓ కన్నతండ్రి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్కు చెందిన తిరునగరి శ్రీనివాస్(47)కు భార్య అరుణ, ఒక కుమార్తెతో కలిసి జీవనం సాగిస్తున్నారు. కూతురు డిగ్రీ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసుకుంది. అయితే కొంతకాలంగా శ్రీనివాస్ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. తన కూతురుకు పెళ్లి చేయలేకపోతున్నానని బెంగ పెట్టుకున్నాడు. ఇదే మానసిక వేదనతో మంగళవారం కామారెడ్డిలోని రైల్వే బ్రిడ్జి వద్దకు చేరుకున్నాడు. ఆ సమయంలో వెళుతున్న ఓ గూడ్స్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.