Imran Khan: పాకిస్తాన్ జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వెయ్యేళ్ల పాటు జైలు శిక్షను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నారని, తన దేశం కోసం జైలు శిక్షను కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నారని మీడియా ఓ నివేదికలో పేర్కొంది. 70 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్కు ఆగస్టు 5న ప్రభుత్వానికి చెందిన బహుమతులు (తోషాఖానా) అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయాన్ని దాచినందుకు సెషన్స్ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. అతను ప్రస్తుతం పంజాబ్ ప్రావిన్స్లోని అటాక్ జైలులో ఖైదు చేయబడ్డాడు. ఈ శిక్షను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఆగస్టు 22న ఐహెచ్సీ చీఫ్ జస్టిస్ అమర్ ఫరూక్, జస్టిస్ తారిక్ మెహమూద్ జహంగిరితో డివిజన్ బెంచ్ విచారణ చేపట్టనుంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ పార్టీ న్యాయబృంద సభ్యుడు ఉమైర్ నియాజి జైల్లో ఇమ్రాన్ఖాన్తో భేటీ అయ్యారు.
అటాక్ జైలులో ఇమ్రాన్ ఖాన్ను కలిసిన తర్వాత ఉమైర్ నియాజి శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ.. మాజీ ప్రధాని గడ్డం పెంచినప్పుటికీ ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపారు. ఆయనకు ఈ రోజు అద్ధం, షేవింగ్ కిట్ అందించినట్లు వెల్లడించారు. ఆరుగురు బృందంలో ఇమ్రాన్ ఖాన్ను కలవడానికి తనకు మాత్రమే అనుమతి లభించిందని ఉమైర్ నియాజీ నొక్కి చెప్పారు. ఇమ్రాన్ ఖాన్ను కలిసేందుకు కోర్టు ఆరుగురిని అనుమతించినప్పటికీ జైలు అధికారులు ఒకరిని మాత్రమే లోపలికి పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయబృంద ప్రవేశాన్ని నిరాకరించినందుకు జైలర్ ప్రవర్తనపై కోర్టు ధిక్కార పిటిషన్ను దాఖలు చేస్తామన్నారు. “జైలులో సౌకర్యాలు కల్పించకపోవడం గురించి నేను పట్టించుకోను. నన్ను 1,000 సంవత్సరాలు జైలులో ఉంచినా పర్వాలేదు, కానీ నేను దానికి సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే స్వేచ్ఛ కోసం త్యాగాలు చేయాల్సి ఉంటుంది, ”అని ఇమ్రాన్ ఖాన్ అన్నారని న్యాయవాది ఉమైర్ నియాజి మీడియా ఎదుట పేర్కొన్నారు. ఇమ్రాన్ ఖాన్ దేశవ్యాప్తంగా 140కి పైగా కేసులను ఎదుర్కొంటున్నారు. ఏప్రిల్ 2022లో ఇమ్రాన్ను తొలగించినప్పటి నుంచి ఉగ్రవాదం, హింస, దైవదూషణ, అవినీతి, హత్య వంటి ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.