Leading News Portal in Telugu

Floating Wind Park: ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ విండ్ పార్క్‌ ప్రారంభం.. ఎక్కడంటే?


Biggest Floating Wind Park: నార్వే బుధవారం ఉత్తర సముద్రంలో ప్రపంచంలోనే అతిపెద్ద తేలియాడే విండ్ పార్క్‌ను ప్రారంభించింది. శిలాజ ఇంధనాల నుంచి గ్రీన్ ఎనర్జీకి మారడం కోసం అభివృద్ధి చెందుతున్న సాంకేతికత ఆశాజనకంగా పరిగణించబడుతుంది. హైవైండ్ టాంపెన్ ఫీల్డ్ 11 టర్బైన్‌లతో రూపొందించబడింది. ఒక్కొక్కటి 8.6 మెగావాట్ల వరకు ఉత్పత్తి చేస్తుంది. ఐదు పొరుగు చమురు, గ్యాస్ ప్లాట్‌ఫారమ్‌లకు వాటి శక్తి అవసరాలలో 35 శాతం అందిస్తుంది. సముద్ర తీరానికి 140 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం గత సంవత్సరం చివరిలో ఉత్పత్తిని ప్రారంభించింది. అయితే నార్వేజియన్ ప్రిన్స్ హాకోన్, ప్రధాన మంత్రి జోనాస్ గహర్ స్టోర్ ఈ క్షేత్రాన్ని బుధవారం అధికారికంగా ప్రారంభించారు.

దేశ ప్రజలకు, యూరోపియన్లందరికీ మరింత విద్యుత్ అవసరమని, ఉక్రెయిన్‌లో యుద్ధం ఈ పరిస్థితిని బలపరిచిందని నార్వే ప్రధాని జోనాస్ గహర్ స్టోర్ పేర్కొన్నారు. యూరప్ తన వాతావరణ లక్ష్యాలను చేరుకోవాలనుకుంటే ఈ విద్యుత్తు తప్పనిసరిగా పునరుత్పాదక వనరుల నుండి ఉండాలని ఆయన చెప్పారు. సముద్రపు అడుగుభాగంలో స్థిరపడిన ఆఫ్‌షోర్ విండ్ టర్బైన్‌ల వలె కాకుండా, తేలియాడే టర్బైన్‌లు వాటి పేరు సూచించినట్లుగా, సముద్రగర్భానికి లంగరు వేసిన తేలియాడే నిర్మాణంపై అమర్చబడి ఉంటాయి. వాటిని నిర్మించడం చాలా ఖర్చుతో కూడిన పని. 260 నుంచి 300 మీటర్ల (853 నుండి 984 అడుగులు) మధ్య లోతులో ఉన్న హైవైండ్ టాంపెన్ నిర్మాణానికి దాదాపు 7.4 బిలియన్ క్రోనర్లు ($691 మిలియన్లు) ఖర్చయ్యాయి. అవును ఇది ఖర్చుతో కూడుకున్న పనేనని ప్రధాని చెప్పుకొచ్చారు.

ఈ ప్రాజెక్ట్ నార్వే ప్రభుత్వ-యాజమాన్య చమురు గ్రూపులు ఈక్వినార్, పెటోరో, ఆస్ట్రియా సంస్థ అయిన ఓఎంవీ, ఇటలీ సంస్థ ఈఎన్‌ఐ. నార్వేజియన్‌ అనుబంధ సంస్థ అయిన Var Energi, జర్మనీ వింటర్‌షాల్ DEA, జపాన్ ఆధ్వర్యంలోని ఇన్‌పెక్స్‌ల యాజమాన్యంలో ఉంది.