Pak Ex Minister: చంద్రుడి ఉపరితలంపై దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. భారతదేశం చేసిన అద్భుతమైన ఫీట్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు అభినందించారు. భారతీయులే కాకుండా విదేశాల్లోని ప్రముఖులు కూడా భారత్ సాధించిన ఈ విజయాన్ని ప్రశంసలతో ముంచెత్తారు. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంలో సమాచార, ప్రసార శాఖ మాజీ మంత్రి ఫవాద్ చౌదరి కూడా చంద్రుని ల్యాండింగ్ను ప్రశంసించారు. ట్విటర్ వేదికగా ఆయన చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్పై ప్రశంసలు కురిపించారు.
ట్విటర్లో ఆయన ఇలా రాసుకొచ్చాడు. “చంద్రయాన్ 3 చంద్రునిపైకి అడుగుపెట్టినప్పుడు ఇస్రోకు ఇది ఎంతో గొప్ప క్షణం. ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ ఛైర్మన్తో యువశాస్త్రవేత్తలు ఈ క్షణాన్ని ఆస్వాదించడం చూడగలిగాను. కలలు ఉన్న యువతరం మాత్రమే ప్రపంచాన్ని మార్చగలదు.” అని పాక్ మాజీ మంత్రి పేర్కొన్నారు. అంతకుముందు చంద్రయాన్-3 ల్యాండింగ్ కార్యక్రమాన్ని పాకిస్తాన్ మీడియా ప్రసారం చేయాలని కూడా ఆయన సూచించారు. ఈ మిషన్ను “మానవజాతికి చారిత్రాత్మక ఘట్టం” అని అభివర్ణిస్తూ భారత శాస్త్రవేత్తలు, అంతరిక్ష సంఘాన్ని కూడా ఆయన అభినందించారు. గతంలో ట్విటర్ వేదికగా చేసిన పోస్ట్లో.. పాక్ మీడియా రేపు సాయంత్రం 6.15 గంటలకు చంద్రయాన్ చంద్రుని ల్యాండింగ్ను ప్రత్యక్షంగా చూపించాలని కోరారు. మానవజాతికి ముఖ్యంగా ప్రజలకు, శాస్త్రవేత్తలకు, భారత అంతరిక్ష సంఘానికి చారిత్రాత్మక క్షణమని పేర్కొన్నారు. విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా చంద్రుని మీద ల్యాండింగ్ అయిన తర్వాత, రోవర్ ప్రజ్ఞాన్ మూడు గంటల తర్వాత ల్యాండర్ క్రాఫ్ట్ నుంచి బయటకు వస్తుంది.