Pakistan: పాకిస్తాన్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు ఆ దేశంలోని పంజాబ్ ప్రావిన్స్లో ఐఎస్ఐఎస్కు చెందిన ఇద్దరు కీలక కమాండర్లు సహా ఏడుగురు అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేయడం ద్వారా పెద్ద ఉగ్రవాద కుట్రను భగ్నం చేసినట్లు పోలీసులు సోమవారం పేర్కొన్నారు. ఈ ప్రావిన్స్లోని వివిధ జిల్లాల్లో నిర్వహించిన పలు ఇంటెలిజెన్స్ ఆధారిత కార్యకలాపాలలో ఉగ్రవాదులను పంజాబ్ పోలీసులకు చెందిన కౌంటర్ టెర్రరిజం డిపార్ట్మెంట్ (CTD) అరెస్టు చేసింది.
కౌంటర్ టెర్రరిజం డిపార్ట్మెంట్ ప్రావిన్స్ అంతటా 49 ఇంటెలిజెన్స్ ఆధారిత కార్యకలాపాలను నిర్వహించింది. ఈ సమయంలో ఐఎస్ఐఎస్కు చెందిన ఇద్దరు కమాండర్లు షాహిద్ హుస్సేన్, సియాఫుల్ దిన్ సహా తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్, లష్కరే-జాంగ్వీలకు చెందిన ఏడుగురు అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేసినట్లు కౌంటర్ టెర్రరిజం డిపార్ట్మెంట్ ప్రతినిధి తెలిపారు. . ఇద్దరు కమాండర్లు పంజాబ్లో పనిచేస్తున్నారని ఆయన చెప్పారు. ప్రావిన్స్లోని ముఖ్యమైన ఇన్స్టాలేషన్లు, ఇతర ప్రదేశాలను లక్ష్యంగా చేసుకోవడానికి ఉగ్రవాదులు ప్లాన్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. వీరిపై పోలీసులు ఆరు కేసులు నమోదు చేశారు. వారి నుంచి 3,100 గ్రాముల పేలుడు పదార్థాలు, 14 డిటోనేటర్లు, 10 అడుగుల రక్షణ ఫ్యూజ్ వైర్, నిషేధిత సాహిత్యం, సెల్ ఫోన్లు, నగదును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
గత శనివారం పంజాబ్ ప్రావిన్స్లోని లాహోర్, షేక్పురాలో ఐదుగురు మహిళా ISIS ఉగ్రవాదులను CTD అరెస్టు చేసింది. “కౌంటర్ టెర్రరిజం డిపార్ట్మెంట్ బృందాలు దాష్ మహిళల రహస్య స్థావరాలపై దాడి చేసి లాహోర్లో ముగ్గురిని, షేక్పురాలో ఇద్దరిని (లాహోర్కు 50 కిలోమీటర్ల దూరంలో) అరెస్టు చేశాయి” అని CTD తెలిపింది. వారి నుంచి ఆయుధాలు, నగదు, నిషేధిత సాహిత్యం, సెల్ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. మహిళలు దాష్లో చురుకైన సభ్యులని, దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలలో పాల్గొంటున్నారని పేర్కొంది.గత నెలలో, పంజాబ్లోని వివిధ ప్రాంతాల్లో చేపట్టిన కార్యకలాపాలలో నిషేధిత సంస్థలకు చెందిన 20 మంది ఉగ్రవాదులను CTD అరెస్టు చేసింది.