Leading News Portal in Telugu

New york: ముంచెత్తుతున్న వరదలు న్యూయార్క్ లో ఎమర్జెన్సీ


Floods in New York: ఇటీవల ప్రపంచ దేశాలన్నీ వరదలు, భూకంపాలతో అతలాకుతలం అయిపోతున్నాయి. ఇటీవల లిబియాలో సంభవించిన వరతల కారణంగా వేల మంది చనిపోయారు. మొరాకోలో వచ్చిన భూకంపం కారణంగా కూడా కొన్ని వందల మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఇలా ఈ ఏడాది చివరిలో ప్రపంచం మొత్తం మీద ప్రకృతి  విలయతాండవం చేస్తోంది. తాజాగా న్యూయార్క్ సిటీని వరదలు ముంచెత్తాయి. శుక్రవారం రాత్రి కుండపోతగా వర్షం కురవడంతో పలు ప్రాంతాలు నీట మునిగాయి. వీధులన్నీ జలమయం కాగా  లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఇళ్లలోకి నీరు చేరింది. ఆఖరికి న్యూయార్క్ విమానాశ్రయంలోకి కూడా నీరు చేరింది.

దీంతో ఎయిర్ పోర్టును తాత్కాలికంగా మూసివేశారు. విమానాల రాకపోకలను కూడా మళ్లించారు. ఇక శనివారం కూడా వరద ముప్పు ఉందని హెచ్చరిస్తున్నారు అధికారులు. అందుకే అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దంటూ హెచ్చరికలు జారీ చేస్తు్న్నారు. వరద కారణంగా వాహనాలు ఎక్కడపడితే అక్కడ ఆగిపోయాయి. ముందుకు వెళ్లలేని పరిస్థితులు ఉన్నాయి. ఇక రైళ్ల పరిస్థితులు కూడా అలానే ఉన్నాయి. సబ్ వేలలోకి వరద నీరు చేరడంతో రైళ్లను అధికారులు రద్దు చేశారు. రెండేళ్ల కిందట కూడా సెప్టెంబర్ నెలలోనే అమెరికాలో వరదలు బీభత్సం సృష్టించాయి. బ్రూక్లిన్, క్వీన్స్ రాష్ట్రాల్లో వరదల కారణంగా గతేడాది 13 మంది చనిపోయారు. ఇక ఈ వరదలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.