
Iran: ఇస్లామిక్ దేశం ఇరాన్లో చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో అందరికి తెలుసు. అక్కడ హత్యలకు పాల్పడిని, మోసం చేసినా, డ్రగ్స్ అక్రమ రవాణా వంటి వాటికి మరణశిక్షలు విధిస్తుంటారు. ఇక స్త్రీలు మత పద్ధతులు ఉల్లంఘించినా, హిజాబ్ ధరించకపోయిన శిక్షలు కఠినంగా ఉంటాయి. హిజాబ్ ధరించని కారణంగా అక్కడి మోరాలిటీ పోలిసింగ్ దాడుల్లో 2022లో మహ్సా అమిని అనే యువతిని కొట్టి చంపేశారు. ఈ వివాదం అక్కడ మహిళల్లో, యువతలో తీవ్ర ఆగ్రహావేశాలకు కారణమైంది. పెద్ద ఎత్తున ఉద్యమం ఎగిసిపడింది.
Read Also: Kargil Night Landing: చరిత్ర సృష్టించిన ఇండియన్ ఎయిర్ఫోర్స్.. కార్గిల్లో C130-J విమానం నైట్ ల్యాండింగ్.. ఎందుకంత ప్రత్యేకం..
ఇదిలా ఉంటే తాజాగా ‘‘ప్రజా నైతికతను ఉల్లంఘించినందుకు’’ ఒక మహిళకు ఇరాన్ అధికారులు 74 కోరడా దెబ్బలను శిక్షగా విధించారు. ఆమె తలపై వస్త్రాన్ని కప్పుకోకపోవడంతో ఈ శిక్ష విధించింది అక్కడి న్యాయవ్యవస్థ. రోయా హెష్మతి అనే మహిళ రాజధాని టెహ్రాన్ లోని రద్దీగా ఉండే బహిరంగ ప్రదేశాల్లో అవమానకరంగా కనిపించిందని అక్కడి న్యాయవ్యవస్థ అభియోగాలు మోపింది. ఆమెకు షరియా చట్టం ప్రకారం 74 కొరడా దెబ్బల్ని శిక్షగా విధించింది.
1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరాన్ లోని మహిళలందరూ తమ మెడను, తలను కప్పి ఉంచుకోవాలనే చట్టం ఉంది. 2022 చివర్లో మహ్స అమిని మరణం తర్వాత చాలా మంది మహిళలు హిజాబ్ తీసి విసిరేస్తూ, జట్టు కత్తిరించుకుంటూ నిరసన తెలిపారు. ఆ తర్వాత నుంచి హిజాబ్ విషయంలో ఇరాన్ అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ధిక్కరించే వారిపై చర్యలు తీసుకుంటున్నారు.