Leading News Portal in Telugu

America: అమెరికాలో మ‌రో భార‌తీయ విద్యార్థి మృతి.. ఈ ఏడాది నాలుగో మరణం..


America: అమెరికాలో మ‌రో భార‌తీయ విద్యార్థి మృతి.. ఈ ఏడాది నాలుగో మరణం..

అమెరికాలో మరో భార‌తీయ విద్యార్థి శ్రేయాస్ రెడ్డి బెణిగేరి అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. ఒహియోలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. అయితే, ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇక, శ్రేయాస్ రెడ్డి మృతికి కార‌ణాలు ఇప్పటి వరకు తెలియ రాలేదని పోలీసులు చెప్పారు. శ్రేయాస్ రెడ్డి సిన్సినాటిలోని లిండ‌ర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్ విద్యార్థి అని తెలిపారు.


ఇక, శ్రేయాస్ రెడ్డి మృతిపై న్యూయార్క్‌లోని ఇండియ‌న్ కాన్సులేట్ ట్విట్టర్ వేదికగా తెలియజేసింది. ఒహియోలో భారతీయ సంతతికి చెందిన విద్యార్థి శ్రేయాస్ రెడ్డి బెణిగేరి దురదృష్టవశాత్తూ మరణించడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపింది. దీనిపై పోలీసుల విచారణ చేస్తున్నారని పేర్కొనింది. అత‌ని మృతికి గ‌ల కార‌ణాలు తెలుసుకునే ప్రయత్నం జరుగుతుంది.. శ్రేయాస్ రెడ్డి కుటుంబంతో ట‌చ్‌లో ఉన్నామని ఇండియ‌న్ కాన్సులేట్ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది.

అయితే, ఈ సంవత్సరం భారతీయ విద్యార్థులు మరణించడం ఇది నాలుగోది. 2024 ప్రారంభ‌మైన నెల రోజుల వ్యవధిలోనే అమెరికాలో న‌లుగురు భార‌తీయ విద్యార్థులు మృతి చెంద‌డం తీవ్ర క‌ల‌క‌లం రేపుతుంది. నీల్ ఆచార్య, వివేక్ షైనీ, ఆకుల్ ధావ‌న్ అనే ముగ్గురు విద్యార్థులు గత జ‌న‌వ‌రి నెల‌లో చ‌నిపోయారు. తాజాగా శ్రేయాస్ రెడ్డి మరణించాడు.