
తీవ్ర సంచలనం సృష్టించిన హైతీ (Haiti) మాజీ అధ్యక్షుడు జొవెనల్ మోయిస్ (Jovenel Moise) హత్య కేసులో విస్తుగొల్పే విషయాలు వెలుగుచూశాయి. ఈ కేసులో ఆయన సతీమణి మార్టిన్ మోయిస్(Martine Moise) హస్తం ఉందని ఓ నివేదిక బయటకు వచ్చింది.
హైతీ మాజీ ప్రధాని క్లాడ్ జోసెఫ్(Claude Joseph)తో కలిసి జోవెనల్ మోయిస్ హత్యకు ఆమె సహకరించారని ఆ నివేదిక పేర్కొంది. ఈ కేసుని విచారిస్తున్న ఓ అధికారి సంచలన నివేదికను విడుదల చేశారు. అంతేకాదు.. అప్పటి పోలీస్ చీఫ్ లియోన్ చార్లెస్ (Leon Charles)పై కూడా ఆ అధికారి తీవ్ర ఆరోపణలు గుప్పించారు. హత్య, హత్యాయత్నం, అంతర్గత భద్రతకు వ్యతిరేకంగా కుట్ర వంటి అభియోగాలు మోపారు. ప్రస్తుతం ఈ నివేదిక హైతీలో పెను దుమారమే రేపుతోంది.
ఇలా హత్య..
2021లో హైతీ అధ్యక్షుడిగా ఉన్న జొవెనెల్ మోయిస్ (53) తన ప్రైవేటు నివాసంలోనే హత్యకు గురయ్యారు. అర్థరాత్రి సమయంలో కొందరు దుండగులు జరిపిన కాల్పుల్లో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఆయన సతీమణి మార్టిన్ మోయిస్ కూడా ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డారు. ఓ దేశాధ్యక్షుడే హత్యకు గురవ్వడంతో.. ఈ సంఘటన అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అప్పటి ప్రధాని జోసెఫ్.. ఈ హత్యకు సాయుధ కమాండో గ్రూపు సభ్యులే కారణమని ఆరోపణలు చేశారు.
గతంలో నలుగురు అధికారులు విచారణ చేపట్టినా.. మధ్యలోనే వైదొలగారు. అనంతరం ప్రస్తుతం న్యాయమూర్తి హోదాలో ఉన్న వాల్తర్ వెస్సర్ వోల్టైర్(Walther Wesser Voltaire) అనే ఒక అధికారి ఈ కేసుని విచారిస్తున్నారు. గత నలుగురు అధికారుల తరహాలో భయపడి పారిపోకుండా.. వోల్టైర్ ఎంతో ధైర్యంగా ఈ కేసు విచారణను ప్రారంభించారు.
ఈ నేపథ్యంలోనే ఆయన మార్టిన్ మోయిస్, జోసెఫ్లతో పాటు డజన్ల కొద్దీ అనుమానితులపై అభియోగాలు మోపుతూ.. 122 పేజీల నివేదికను విడుదల చేశారు. అయితే.. తనపై వచ్చిన ఈ అభియోగాలను మాజీ ప్రధాని జోసెఫ్ తోసిపుచ్చారు. ప్రస్తుతం ప్రధానిగా ఉన్న ఏరియల్ హెన్రీ ఈ కేసుని తప్పుదోవ పట్టిస్తున్నారని, తనకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. 2021లో తనని, మార్టిన్ మోయిస్ని చంపడంలో వారు విఫలమయ్యారని.. ఇప్పుడు వాళ్లు తమ ఎజెండా కోసం హైతీ న్యాయ వ్యవస్థనే ఉపయోగించుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. మొత్తానికి ఈ కేసు నివేదిక తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.