- రష్యాలోని ఓ జైలులో ఖైదీల మధ్య ఘర్షణ
-
ఘర్షణలో ఎనిమిది మంది మృతి -
వీరిలో నలుగురు జైలు ఉద్యోగులు -
వోల్గోగ్రాడ్ ప్రాంతంలోని ఐకే-19 సురోవికినో శిక్షాస్మృతి కాలనీలో హింసాకాండ.

రష్యాలోని ఓ జైలులో ఖైదీల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఎనిమిది మంది చనిపోయారు. వీరిలో నలుగురు జైలు ఉద్యోగులు కూడా ఉన్నారు. రష్యాలోని వోల్గోగ్రాడ్ ప్రాంతంలోని అత్యంత భద్రత కలిగిన ఐకే-19 సురోవికినో శిక్షాస్మృతి కాలనీలో ఈ హింసాకాండ చోటుచేసుకుంది. సమాచారం ప్రకారం.. కొంతమంది ఖైదీలు హింసాత్మకంగా తిరుగుబాటు చేశారు. కత్తులు పట్టుకుని.. తాము ఇస్లామిక్ స్టేట్కు సంబంధించినవారంటూ హల్చల్ చేశారు. అంతేకాకుండా.. కొంతమంది ఖైదీలను బెదిరిస్తూ.. జైలులో కొంత భాగాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ముస్లింలపై అణచివేతకు ప్రతీకారం తీర్చుకునేందుకే దాడి చేశామంటూ వారు పేర్కొన్నారు.
ఒక సాధారణ క్రమశిక్షణ సమావేశం నిర్వహించాల్సిన సమయంలో ఈ ఘర్షణ తలెత్తిందని ఒక నివేదిక పేర్కొంది. ఈ సమావేశం జరుగుతుండగా.. రామ్జిడిన్ తోషోవ్ (28), రుస్తమ్చోన్ నవ్రూజీ (23), నజిర్చోన్ తోషోవ్ (28), తైమూర్ ఖుసినోవ్ (29) అనే ఖైదీల బృందం దాడులకు దిగింది. ఉజ్బెకిస్థాన్, తజికిస్థాన్లకు చెందిన నలుగురు వ్యక్తులు కత్తులతో గార్డులపై దాడి చేశారు. ఈ దాడిలో పలువురు గాయపడ్డారు. అలాగే ఎనిమిది మంది జైలు సిబ్బంది.. నలుగురు తోటి ఖైదీలను బందీలుగా తీసుకుని దాడి చేశారు.
కాగా.. ఈ ఘర్షణకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. అందులో.. రక్తంతో తడిసిన జైలు గార్డుపై ఒక ఖైదీ కత్తిని పట్టుకోవడం కనిపిస్తుంది. మరో వీడియోలో జైలు యార్డ్లో దాడి చేసిన వారిని చూపిస్తుంది. ఇక్కడ ఒక ఖైదీ ముఖమంతా రక్తంతో తడిసి పోయింది. అంతేకాకుండా.. ఆ వీడియోలో దాడి చేసిన వారు ఐసిస్కు తమ విధేయతగా ప్రతిజ్ఞ చేశారు. ముస్లింలను హింసించినందుకు ప్రతీకారంగా ఈ దాడి జరిగిందని వారు పేర్కొన్నారు. పరిస్థితి మరింత దిగజారడంతో.. సాయుధ ప్రత్యేక రష్యన్ దళాలు, స్నిపర్లు మోహరించారు.