Leading News Portal in Telugu

3500 Year Old Jar: 3500 ఏళ్ల నాటి కూజాను పగలగొట్టినా.. మ్యూజియంకు మళ్లీ ఆహ్యానించారు!


  • 3500 ఏళ్ల నాటి మట్టి కూజా ముక్కలు
  • బాలుడిని పల్లెత్తు మాట అనని సిబ్బంది
  • బాలుడికి మరోసారి ఆహ్వానం
3500 Year Old Jar: 3500 ఏళ్ల నాటి కూజాను పగలగొట్టినా.. మ్యూజియంకు మళ్లీ ఆహ్యానించారు!

Ariel Geller Visits Hecht Museum 2nd Time: ఇటీవల ఇజ్రాయెల్‌లోని హైఫా యూనివర్సిటీలో ఉన్న హెక్ట్‌ మ్యూజియంలోని 3500 ఏళ్ల నాటి మట్టి కూజా ముక్కలైన విషయం తెలిసిందే. నాలుగేళ్ల బాలుడు ఏరియల్‌ గెలర్‌ తన తల్లిదండ్రులతో మ్యూజియంకు వెళ్లి.. ప్రమాదవశాత్తూ అతి పురాతన కూజాను కిందదేశాడు. ఈ ఘటన అనంతరం సిబ్బంది ఏమంటారో అని బాలుడితో సహా అతడి తల్లిదండ్రులు గజగజ వణికిపోయారు. అయితే 3500 ఏళ్ల నాటి కూజాను పగలగొట్టినా.. మ్యూజియం సిబ్బంది ఆ బాలుడిని కనీసం పల్లెత్తు మాట కూడా అనలేదు. అంతేకాదు మ్యూజియంకు చూసేందుకు మరోసారి ఆహ్యానించారు.

కూజాను పగలగొట్టిన కంగారులో మ్యూజియంలోని వస్తువులను ఏరియల్‌ గెలర్‌ సరిగా చూడలేదని భావించిన సిబ్బంది.. ఆ బాలుడిని మరోసారి ఆహ్యానించారు. ఆహ్వానం మేరకు గత శుక్రవారం తల్లిదండ్రులతో పాటు గెలర్‌ మ్యూజియంకు వెళ్ళాడు. ఈ సందర్భంగా ఒక మట్టి కూజాను మ్యూజియానికి ఆ బాలుడు బహుమతిగా ఇచ్చాడు. గెలర్‌ మనోభావాలను గౌరవిస్తూ ఆనందంగా ఆ కూజాను సిబ్బంది స్వీకరించారు. ఆపై బాలునితో చాలాసేపు సరదాగా గడిపారు. పగిలిన వస్తువులను ఎలా అతికిస్తారో గెలర్‌కు ప్రత్యక్షంగా చూపించారు. బాలుడి పునఃసందర్శన తాలూకు వీడియో వైరల్‌గా మారింది.

పగిలిన కూజాను మ్యూజియం నిపుణులు 3డీ టెక్నాలజీ ద్వారా అతికిస్తున్నారని, వారం రోజుల్లో అది తిరిగి పూర్వరూపు సంతరించుకుంటుందని రిస్టొరేషన్‌ నిపుణుడు రో షెఫర్‌ తెలిపారు. పురాతన వస్తువులు సందర్శనకు వచ్చే వారి చేతికందేంత సమీపంలోనే ఉండాలని, అద్దాల్లో ఉండకూడదని తన అభిప్రాయం అని చెప్పారు. పురాతన వస్తువులను తాకి చూస్తే చరిత్ర, పురాతత్వ శాస్త్రాల పట్ల పిల్లలకు ఆస్తకి పుట్టవచ్చు అని షెఫర్‌ చెప్పుకొచ్చారు. గెలర్‌ తల్లిదండ్రులు మ్యూజియం సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. తమ కుమారుడు పురాతన కూజాను పగలగొట్టినా ఏమీ అనలేదని, మరలా తమకు ఆహ్వానం పలికారని గెలర్‌ తండ్రి అలెక్స్ తెలిపారు. నరకప్రాయంగా మారాల్సిన ఈ ఘటనను మాకో మర్చిపోలేని అనుభూతిగా మిగిల్చారని సంతోషం వ్యక్తం చేశారు.