Leading News Portal in Telugu

Floods in Nepal: భారీ వరదలు.. 170 మంది మృతి, 42 మంది గల్లంతు


  • నేపాల్‌లో భారీ వరదలు
  • వరదల కారణంగా 170 మంది మృతి
Floods in Nepal: భారీ వరదలు.. 170 మంది మృతి, 42 మంది గల్లంతు

Floods in Nepal: నేపాల్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా సంభవించిన వరదలు, అలాగే కొండచరియలు విరిగిపడటంతో ఇప్పటివరకు 170 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో పాటు 42 మంది గల్లంతైనట్లు హోం మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు వరదల కారణంగా 111 మంది గాయపడ్డారని హోం మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రిషిరామ్ పోఖరేల్ తెలిపారు. తూర్పు, మధ్య నేపాల్‌లోని చాలా ప్రాంతాలు శుక్రవారం నుంచి మునిగిపోయాయని, దేశంలోని అనేక ప్రాంతాలలో ఆకస్మిక వరదలు వచ్చినట్లు నివేదికలు ఉన్నాయని అధికారులు తెలిపారు.

అన్ని భద్రతా సంస్థల సహాయంతో సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్‌లు కొనసాగుతున్నాయని రిషిరామ్‌ పోఖరేల్ చెప్పారు. నేపాల్ ఆర్మీ దేశవ్యాప్తంగా 162 మందిని విమానంలో రప్పించింది. వరదల కారణంగా ప్రభావితమైన 4,000 మందిని నేపాల్ ఆర్మీ, నేపాల్ పోలీసులు, సాయుధ పోలీసు ఫోర్స్ సిబ్బంది రక్షించారని పోఖరేల్ చెప్పారు. రక్షించబడిన వారికి ఆహార పదార్థాలతో పాటు అవసరమైన అన్ని సహాయ సామగ్రిని అందించినట్లు అధికారులు తెలిపారు. ఖాట్మండు శివార్లలోని బల్ఖు ప్రాంతంలో సామాజిక కార్యకర్తల సహాయంతో 400 మందికి ఆహారం పంపిణీ చేసినట్లు ప్రతినిధి తెలిపారు.

శనివారం నుంచి పలు జాతీయ రహదారులను దిగ్బంధించారు, కొండచరియలు విరిగిపడటంతో అనేక రహదారులపై వందలాది మంది ప్రజలు చిక్కుకుపోయారు. వరదలు, కొండచరియలు విరిగిపడటంతో రోడ్లను మూసివేశారు. జాతీయ రహదారులపై పడిన కొండచరియలను తొలగించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఖాట్మండును ఇతర జిల్లాలతో కలిపే ప్రధాన భూమార్గమైన త్రిభువన్ హైవేలో రవాణా పునఃప్రారంభమైందని హోం మంత్రిత్వ శాఖ ప్రతినిధి పోఖ్రేల్ తెలిపారు. వరదల కారణంగా నేపాల్‌లో కనీసం 322 ఇళ్లు, 16 వంతెనలు దెబ్బతిన్నాయి. ఖాట్మండు లోయలో 40-45 ఏళ్లలో ఇంత విధ్వంసకర వరదలు, నీటి ఎద్దడిని తాము ఎప్పుడూ చూడలేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటైన్ డెవలప్‌మెంట్ (ICIMOD)లో వాతావరణ, పర్యావరణ నిపుణుడు అరుణ్ భక్త శ్రేష్ఠ మాట్లాడుతూ, “ఖాట్మండులో ఇంతకు ముందు వరదలను నేను ఎప్పుడూ చూడలేదు.’ అని పేర్కొన్నారు.

శుక్రవారం, శనివారాల్లో తూర్పు, మధ్య నేపాల్‌లోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో నేపాల్ ప్రధాన నది అయిన బాగ్మతి ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తోందని ICIMOD నివేదిక తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, రుతుపవనాల రేఖ సాధారణం కంటే ఉత్తర దిశగా ఉండడం వంటివి శనివారం అనూహ్యంగా భారీ వర్షాలకు కారణమని నివేదిక పేర్కొంది. వాతావరణ మార్పు ఆసియా అంతటా వర్షపాతం, సమయాలలో మార్పులకు కారణమవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

బీహార్‌లో వరదల కారణంగా నష్టపోయిన ప్రజలు
వరదల కారణంగా బీహార్‌లోని 13 జిల్లాల్లో 16.28 లక్షల మంది ప్రజలు ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఈ ప్రాంత ప్రజలు ఇప్పటికే వర్షం కారణంగా వరదలను ఎదుర్కొంటున్నారు, అయితే ఇప్పుడు నది ప్రవాహం కూడా వారిని ప్రమాదం అంచున ఉంచింది. ఏజెన్సీ తెలిపిన వివరాల ప్రకారం.. వాల్మీకినగర్‌, బీర్‌పూర్‌ బ్యారేజీల నుంచి శనివారం నీటిని విడుదల చేయడంతో రాష్ట్రంలోని ఉత్తర, మధ్య ప్రాంతాల్లోని కోసి, గండక్‌, గంగా వంటి ఉప్పొంగిన నదులకు ప్రభుత్వం వరద హెచ్చరిక జారీ చేసింది. నేపాల్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శనివారం గండక్, కోషి, మహానంద తదితర నదుల్లో నీటి ప్రవాహం గణనీయంగా పెరిగింది. కోసి నదిపై బీర్‌పూర్ బ్యారేజీ నుంచి రాత్రి 7 గంటల వరకు 56 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా మొత్తం 5.79 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు రాష్ట్ర జలవనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సంతోష్ కుమార్ మాల్ తెలిపారు. ఏజెన్సీ ప్రకారం, కట్టలను రక్షించడానికి అన్ని భద్రతా చర్యలను నిర్ధారిస్తున్నారు. ఈ బ్యారేజీ నుంచి చివరిసారిగా 1968లో గరిష్టంగా 7.88 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.