- ఉత్తర గాజా స్ట్రిప్లో ఇజ్రాయెల్ విధ్వంసం.
- వైమానిక దాడుల్లో 87 మంది మృతి.
- పెద్ద సంఖ్యలో ప్రజలకు గాయాలు.

Israeli strikes in northern Gaza 87 killed and 40 injured: ఉత్తర గాజా స్ట్రిప్లో ఇజ్రాయెల్ విధ్వంసం సృష్టిచింది. శనివారం రాత్రి, అలాగే ఆదివారం పలు ఇళ్లపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ దాడుల్లో దాదాపు 87 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా చాలా మంది కనపడకుండా పోయారు. దాంతో ఇంకా మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ దాడిలో భాగంగా.. బీట్ లాహియా నగరంలో ఇజ్రాయెల్ దాడుల్లో 40 మంది గాయపడినట్లు సమాచారం. ఉత్తర గాజాలో శనివారం అర్థరాత్రి నుండి ఇంటర్నెట్ సేవలకు కూడా అంతరాయం ఏర్పడింది. ఆదివారం మధ్యాహ్నం వరకు వాటిని పునరుద్ధరించలేదు.
ఈ దాడిలో బహుళ అంతస్తుల భవనం, దాని చుట్టూ ఉన్న నాలుగు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ దాడుల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు గాయపడ్డారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ మునీర్ అల్ బుర్ష్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇది ఉత్తర గాజాలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను మరింత దిగజార్చింది. ఇకపోతే, జబాలియా శరణార్థుల శిబిరంలో గత రెండు వారాలుగా ఇజ్రాయెల్ సైన్యం భారీ ఆపరేషన్ నిర్వహిస్తోంది. హమాస్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఈ ప్రచారాన్ని ప్రారంభించినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. ఇజ్రాయెల్ సైన్యం గత ఏడాది కాలంగా ఉత్తర గాజా స్ట్రిప్ను చుట్టుముట్టింది. అంచనాల ప్రకారం ప్రస్తుతం ఉత్తర గాజాలో నాలుగు లక్షల మంది నివసిస్తున్నారు. గాజా ఆరోగ్య అధికారుల ప్రకారం, ఇజ్రాయెల్ దాడిలో 42,000 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు.