- భారత్- కెనడా దేశాల మధ్య కొనసాగుతున్న దౌత్యపరమైన విభేదాలు..
-
బ్రాంప్టన్లో ఆలయ ప్రాంగణంలో కాన్సులర్ క్యాంప్పై ఖలిస్తానీల దాడి.. -
కెనడాలోని కాన్సులర్ క్యాంప్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన భారత్..

India-Canada: భారత్, కెనడాల మధ్య దౌత్యపరమైన విభేదాలు కొనసాగుతున్న వేళ ఇటీవల అక్కడి హిందూ ఆలయంపై దాడి జరగడం తీవ్ర కలకలం రేపుతుంది. ఈ నేపథ్యంలో ఇండియా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. భద్రతా కారణాల రీత్యా ఆ దేశంలో కాన్సులర్ క్యాంప్లను రద్దు చేస్తున్నట్లు టొరంటోలోని భారత కాన్సులేట్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఈ విషయాన్ని ప్రకటించింది.
కాగా, కమ్యూనిటీ క్యాంప్ నిర్వహణకు కనీస భద్రత కల్పించలేమని భద్రతా ఏజెన్సీలు చెప్పుకొచ్చాయి. అందువల్ల ముందు జాగ్రత్త చర్యలో భాగంగా మా షెడ్యూల్ కాన్సులర్ క్యాంప్లను క్యాన్సిల్ చేయాలని నిర్ణయించామని భారత రాయబార కార్యాలయం తెలిపింది. ఇటీవల బ్రాంప్టన్లోని హిందూసభ ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన కాన్సులర్ క్యాంప్పై కొందరు ఖలీస్తానీ తీవ్రవాదులు దాడి చేశారు. సిక్కు వేర్పాటువాదులు ఖలిస్థానీ జెండాలతో వచ్చి నానా వీరంగం సృష్టించారు. కొందరు హిందూ భక్తులను కొట్టడంతో ఈ దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఘటనపై ఎక్స్ మండిపడ్డారు. కెనడాలో హిందూ ఆలయంపై ఉద్దేశపూర్వకంగా జరిగిన దాడిని ఖండిస్తున్నాను చెప్పుకొచ్చారు.
ఇక, భారత దౌత్యవేత్తలను బెదిరించే పిరికిపంద ప్రయత్నాలు కూడా దారుణమైనవి అని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. ఇలాంటి హింసాత్మక చర్యలు భారతదేశ దృఢనిశ్చయాన్ని బలహీన పరచలేవు అని పేర్కొన్నారు. కెనడా సర్కార్ న్యాయం చేస్తుందని, చట్టబద్ధ పాలనను నిలబెడుతుందని మేం ఆశిస్తున్నామన్నారు.