- మయన్మార్ సరిహద్దుల్లో చైనా రాడార్..
- భారత్కి భద్రతాపరమైన ఇబ్బందులు..
- మన క్షిపణుల్ని ట్రాక్ చేసే అవకాశం..

China: భారత సరిహద్దుల్లో చైనా తన మిలిటరీ సామర్థ్యాన్ని విస్తరిస్తోంది. తాజాగా, మయన్మార్ సరిహద్దుకు సమీపంలో నైరుతి యువాన్ ప్రావిన్సులో చైనా ఒక అధునాతన రాడార్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఇది భారత్కి భద్రతాపరంగా ఇబ్బందులు కలిగిస్తుంది. భారత మిస్సైల్ ప్రోగ్రాం, జాతీయ భద్రతపై గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తుంది.
కొత్తగా ఏర్పాటు చేయబడిన లార్జ్ ఫేజ్డ్ అర్రే రాడార్ (LPAR) 5,000 కిలోమీటర్లకు పైగా నిఘా పరిధిని కలిగి ఉందని తెలుస్తోంది. దీని ద్వారా చైనా హిందూ మహాసముద్రంలోని ప్రాంతాలపై, భారత భూభాగాలను కూడా పర్యవేక్షించగలదు. ఈ అధునాతన రాడార్ వ్యవస్థ చైనా నిఘా సేకరణ సామర్థ్యాలను, ముఖ్యంగా ఇండియా బాలిస్టిక్ మిస్సైల్ ప్రోగ్రామ్కి సంబంధించి కన్నేసి ఉంచగలదు.
ముందస్తు హెచ్చరికలు, నిఘా కోసం రూపొందించిన LPAR వ్యవస్థ, బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాలను రియల్ టైమ్లో గుర్తించి ట్రాక్ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. దీని పరిధిలోకి భారత్లో కీలమైన, క్షిపణి ప్రయోగాలను నిర్వహించే తూర్పు తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం వంటివి వస్తాయి. ఈ ద్వీపం నుంచే అగ్ని-5, కే-4 వంటి అధునాతన క్షిపణులను భారత్ పరీక్షిస్తోంది. క్షిపణి వేగం, మార్గం, దూరాలపై కీలమైన డేటాను చైనా సంగ్రహించే అవకాశం ఉంది. భారత దేశ క్షిపణులను కౌంటర్ చేయడానికి చైనా అనుగుణంగా క్షిపణులను రూపొందించే అవకాశం ఉంది.
ఇదే కాకుండా హిందూ మహాసముద్రం, బంగాళా ఖాతంలోని కీలకమైన వాణిజ్య మార్గాలపై, భారత నావికా దళ ఉనికిని పర్యవేక్షించే అవకాశం ఉంది. చైనాలో ఇప్పటికే బీజింగ్ కోర్లా, జిన్జియాంగ్లో LPAR రాడార్లు ఉన్నాయి. ఇవి భారతపై నిఘా కవరేజీని అందిస్తున్నాయి. యునాన్లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న రాడార్ భారత్ దక్షిణ, తూర్పు ప్రాంతాలపై నిఘాను విస్తరిస్తుంది.