Leading News Portal in Telugu

Pakistan: Muslim ‘scholar’ who aided ISI in abducting Kullbhushan Jadhav, shot dead by unknown men


  • పాకిస్తాన్‌లో మరోసారి ‘‘గుర్తు తెలియని వ్యక్తులు’’..
  • ఉగ్రవాది ముఫ్తీ షా మీర్‌ని కాల్చి చంపిన వ్యక్తులు..
  • కుల్‌భూషన్ కిడ్నాప్‌కి సహకరించిన మీర్..
Pakistan: కుల్‌భూషన్ జాదవ్ కిడ్నాప్‌కి సాయం చేసిన ఉగ్రవాది హతం.. పాక్‌లో ‘‘గుర్తు తెలియని వ్యక్తులు’’

Pakistan: పాకిస్తాన్‌లో మరోసారి గుర్తు తెలియని వ్యక్తులు మరోసారి తమ సత్తా చూపించారు. భారత వ్యతిరేక, పాక్ ఉగ్రవాదుల్ని గుర్తుతెలియని వ్యక్తులు ఒక్కొక్కరిగా మట్టుబెడుతున్నారు. అత్యంత పకడ్భందీగా ఉగ్రవాదుల్ని హతమారుస్తున్నారు. ఇప్పటి వరకు పాక్ ఇంటెలిజెన్స్ సంస్థలు, ఆర్మీ వీరిని పట్టుకోలేకపోతోంది. అయితే, దీని వెనక భారత హస్తముందని పాక్ ఆరోపిస్తోంది.

తాజాగా బలూచిస్తాన్‌లో ముస్లిం పండితుడు, ఉగ్రవాదిగా చెబుతున్న ముఫ్తీ షా మీర్‌ని కాల్చి చంపారు. శుక్రవారం రాత్రి కెచ్ లోని తుర్బాట్ పట్టణంలో గుర్తు తెలియని సాయుధ వ్యక్తులు కాల్చి చంపారని పోలీసులు తెలిపారు. రాత్రి ప్రార్థనలు ముగించుకుని బయటకు వస్తుండగా టార్గెటెడ్ అటాక్ చేశారు. మోటార్ సైకిళ్లపై వెళ్తున్న సాయుధ వ్యక్తులు మీర్‌పై కాల్పులు జరిపారు. వెంటనే అతడిని తుర్బాత్ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు పోలీసులు తెలిపారు. గతంలో ఇతడిపై రెండు సార్లు హత్యాయత్నాలు జరిగాయి.

మీర్‌కి పాకిస్తాన్‌లోని ఇస్లామిక్ ఛాందసవాద రాజకీయ పార్టీ అయిన జెఐయు-ఎఫ్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. భారత వ్యక్తి కుల్‌భూషన్ జాదవ్ కిడ్నాప్‌లో ఇతను ఐఎస్ఐకి సహకరించాడు. జాదవ్‌ని పాకిస్తాన్ భారత ఏజెంట్ అని ఆరోపిస్తూ అరెస్ట్ చేసి, అక్కడి జైలులో ఉంచింది. ఇతను మానవ అక్రమ రవాణా చేస్తున్నాడు. ఈ ముసుగులో డ్రగ్స్, అక్రమ ఆయుధ రవాణా కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు.

ఉగ్రవాదిగా, తరుచుగా పాక్ లోని ఉగ్రవాద శిక్షణ శిబిరాలకు మీర్ వెళ్తుంటాడు. పాక్ నుంచి భారత్‌లోకి ఉగ్రవాదుల చొరబాట్లకు సాయం చేస్తుంటాడు. పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ సూచన మేరకు పాకిస్తాన్ సైన్యానికి బలూచ్ లిబరేషన్ గ్రూపుల సమాచారాన్ని అందిస్తున్నాడు. తిరుగుబాటుదారుల ఖచ్చితమైన సమాచారాన్ని పాక్ ఆర్మీకి అందిస్తూ వారి హత్యలకు కారణమవుతున్నాడు. ఇతడి నెట్వర్క్ ఆఫ్ఘనిస్థాన్ వరకు విస్తరించింది.