Leading News Portal in Telugu

Pakistani man kills WhatsApp group admin in anger after being removed from chat


  • వాట్సాప్ గ్రూప్ నుంచి తొలగించినందుకు హత్య..
  • అడ్మిన్‌ని కాల్చి చంపిన వ్యక్తి..
  • పాకిస్తాన్ పెషావర్‌లో ఘటన..
WhatsApp: వాట్సాప్ గ్రూప్ నుంచి తొలగింపు.. అడ్మిన్‌ని కాల్చి చంపిన వ్యక్తి..

WhatsApp: వాట్సాప్ గ్రూప్ నుంచి రిమూవ్ చేసినందుకు ఓ వ్యక్తి ఏకంగా అడ్మిన్‌నే చంపేశాడు. ఈ ఘటన పాకిస్తాన్‌లో జరిగింది. నిందితుడు కాల్చి చంపినందుకు అతడిపై కేసు నమోదైంది. పాకిస్తాన్‌లో ఖైబర్ ఫఖ్తుంఖ్వా రాష్ట్ర రాజధాని పెషావర్‌లో ఈ ఘటన జరిగింది. ఈ ప్రాంతంలో వ్యవస్థీకృత నేరాలు, ఉగ్రవాదం చాలా ఎక్కువ. ఈ ప్రాంతంలో తుపాకీలు పొందడం చాలా సులభం.

వివరాల్లోకి వెళ్తే, ఓ విషయంలో వాగ్వాదం తర్వాత ముష్తాక్ అహ్మద్ అనే వ్యక్తి, అష్ఫాక్‌ ఖాన్ ని వాట్సాప్ గ్రూప్ నుంచి తొలగించడంతో వివాదం మొదలైంది. ఇద్దరు రాజీ పడాలని నిర్ణయించుకుని కలవడానికి అంగీకరించారు. కానీ, అష్ఫాక్, ముష్తాక్‌ని కాల్చి చంపాడు. వాట్సాప్ గ్రూప్ నుంచి తొలగించినందుకే ఈ దాడి జరిగినట్లు తెలిసింది. బాధితుడి సోదరుడు హుమాయున్ ఖాన్ మాట్లాడుతూ.. తాను సంఘటన స్థలంలోనే ఉన్నానని, అయితే వివాదం తీవ్రత గురించి తనకు తెలియదని చెప్పారు.

హత్యకు గురైన ముష్తాక్, అష్ఫాక్ మధ్య ఒక వాట్సాప్ గ్రూప్‌లో కొన్ని విభేదాలు ఉన్నాయి. దీంతోనే తన సోదరుడిని అష్ఫాక్ కాల్చి చంపినట్లు హుమాయున్ ఆరోపించారు. దాడి చేసిన తర్వాత అష్ఫాక్ అక్కడి నుంచి పారిపోయాడు. అతడిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. ఈ సంఘటన స్థానికంగా సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. పవిత్ర రంజాన్ మాసంలో ఇలాంటి హింస జరగడంపై చాలా మంది విచారం వ్యక్తం చేశారు.