Leading News Portal in Telugu

Balochistan train hijack: Pak government sends over 200 coffins to Quetta


  • బలూచిస్తాన్ రైలు హైజాక్ ఘటనలో కొనసాగుతున్న ఆపరేషన్..
  • 50 మంది బందీలు చనిపోయారని ప్రకటించిన బీఎల్ఏ..
  • 30 మంది రెబల్స్‌ని హతమార్చినట్లు చెబుతున్న పాకిస్తాన్..
  • 200 శవపేటికలను క్వెట్టాకు తరలించిన పాక్ ప్రభుత్వం..
Pak train hijack: వందలాది ‘‘శవపేటికలు’’ సిద్ధం చేస్తున్న పాకిస్తాన్.. క్వెట్టాకు తరలింపు..

Pak train hijack: పాకిస్తాన్ బలూచిస్తాన్ ప్రావిన్సులో రైలు హైజాక్ జరిగిన ఘటన యావత్ ప్రపంచంలో సంచలనంగా మారింది. బలూచిస్తాన్ విముక్తి కోసం పోరాడుతున్న ‘‘బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ)’’ఫైటర్స్ ఈ హైజాక్‌కి పాల్పడ్డారు. మంగళవారం బలూచ్ రాజధాని క్వెట్టా నుంచి ఖైబర్ ఫఖ్తుంఖ్వా రాజధాని పెషావర్‌కి వెళ్తున్న ‘‘జఫర్ ఎక్స్‌ప్రెస్’’ని మారుమూల సిబి జిల్లాలో బీఎల్ఏ అదుపులోకి తీసుకుంది. ట్రైన్ ట్రాక్‌ని పేల్చేసిన బీఎల్‌ఏ 400 మంది ప్రయాణికులను బందీలుగా చేసుకుంది. ఇందులో పెద్ద సంఖ్యలో పాక్ సైన్యం, ఐఎస్ఐకి చెందిన వారు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం.. బీఎల్ఏ 50 మంది బందీలు చనిపోయినట్లు ప్రకటించారు. మరోవైపు పాక్ అధికారులు తాము 30 మంది బలూచ్ తిరుగుబాటుదారుల్ని చంపామని, 190 మందిని విడిపించామని చెబుతోంది. ఆపరేషన్ కొనసాగుతున్నట్లు ప్రకటించింది.

ఇదిలా ఉంటే, పాకిస్తాన్‌లో పరిస్థితులు మాత్రమే వేరేలా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పాక్ ఆర్మీ వైపు నుంచి కూడా పెద్ద ఎత్తున నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పాకిస్తాన్ ప్రభుత్వం క్వెట్టాకు 200కి పైగా శవపేటికల్ని తరలించింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బోలాన్ నుంచి వీటిని క్వెట్టాకు తరలించినట్లు పాక్ రైల్వే అధికారులు ధ్రువీకరించారు. హైజాక్ జరిగి ఒక రోజు గడిచిన పాక్ ఆర్మీ ఇప్పటి వరకు ఆపరేషన్ ముగించలేకపోయింది. అయితే, ఈ శవపేటికల్ని ప్రోటోకాల్ కింద పంపినట్లు, తద్వారా ప్రతికూల పరిస్థితులు ఎదురైతే ఉపయోగించుకోవచ్చని పాక్ చెబుతోంది. నిజానికి, ఇప్పటికే వందలాది మంది సైనికులను బీఎల్ఏ చంపేసినట్లు అక్కడి సోషల్ మీడియాలో నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.

మరోవైపు, పాక్ ఆర్మీకి ఆపరేషన్ నిర్వహించడంలో కష్టాలు ఎదురవుతున్నాయి. బీఎల్ఏ ఆత్మాహుతి దళం మజీద్ బ్రిగేడ్ ఈ ఆపరేషన్ నిర్వహించింది. అయితే, వీరు ఆత్మాహుతికి ఎల్లప్పుడు ముందుంటారు. బాంబులతో కూడిన జాకెట్లు ధరించిన బీఎల్ఏ రెబల్స్ రైలు నిండా ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్క చిన్న తప్పు జరిగిన రైలు మొత్తం పేలిపోయి, బందీలు మరణించే అవకాశం ఉంది. దీంతో పాక్ అధికారులు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు, బలూచ్ తిరుగుబాటుదారులు పాకిస్తాన్ ప్రభుత్వానికి చివరి వార్నింగ్ ఇచ్చారు. 24 గంటల్లో తమ ఖైదీలను విడుదల చేయకపోతే, బందీలు విచారణ ఎదుర్కోవాల్సిందే అని చెప్పారు. రాజకీయ ఖైదీలను విడుదల చేయకపోతే, బందీలను హతమారుస్తామని చెప్పారు. ఇదే కాకుండా బలూచిస్తాన్ నుంచి పాక్, చైనాలు వెనక్కి వెళ్లాలని హెచ్చరించారు.