వూహాన్లో చిక్కుకున్న భారతీయుడు చెప్పిన జాగ్రత్తలివే…కరోనాకు మందు ఇదే అంటూ…
కరోనా నుంచి బయట పడేందుకు లాక్ డౌన్ ఒక్కటే మార్గమని వూహాన్ పట్టణంలోని భారతీయులు చెబుతున్నారు. చైనా ప్రభుత్వం ఉక్కు సంకల్పంతో లాక్ డౌన్ అమలు చేసింది కాబట్టే కరోనా కట్టి అయ్యిందని స్థానిక భారతీయులు చెబుతున్నారు. దాదాపు 73 రోజుల తర్వాత వూహాన్ నగరంలో లాక్ డౌన్ ఎత్తేశారు. దీంతో ప్రజలు రోడ్ల మీదకు వచ్చి స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారు. ఈ సందర్భంగా అక్కడే నివాసముంటున్న కొందరు భారతీయులు తమ అనుభవాలను పంచుకున్నారు. వూహాన్లో హైడ్రోబయోలజిస్టుగా పనిచేస్తున్న భారతీయుడు అర్జున్జిత్ తన అనుభవాలను చెబుతూ….చైనా ప్రభుత్వం వూహాన్లో 73 రోజుల లాక్డౌన్ని అత్యంత కఠినంగా అమలు చేశారు. అందరూ ఇళ్లకే పరిమితమయ్యాం. భారతీయులందరూ కూడా అదే పని చేయండి. ఇళ్లల్లో ఉంటేనే సురక్షితంగా ఉంటారు అని ఆయన చెప్పుకొచ్చారు. కేవలం అధికారుల అనుమతితోనే తాను ఇంటి సమీపంలోని లేబోరేటరీకి వెళ్లేవాడినని తెలిపారు. అంతేకాదు భారత్ సకాలంలో నిర్ణయం తీసుకోవడం ద్వారా మంచిపని చేసిందని చెప్పారు. అయితే వర్షాకాలం సమీపిస్తే ఇతర వ్యాధులు కూడా ప్రబలే ప్రమాదం ఉంది కాబట్టి భారత్ ముందు పెను సమస్య పొంచి ఉందని, వేసవి లోగా ఈ సమస్య నుంచి పడితే చాలని తెలిపారు.
కరోనా వైరస్ ప్రబలుతున్నప్పుడు భారత్ రెండు ప్రత్యేక ఎయిర్ ఇండియా విమానాల ద్వారా 700 మంది భారతీయులను, విదేశీయులను చైనా నుంచి తరలించింది. కానీ కేరళకు చెందిన అరుణ్ జిత్ వూహాన్లోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నారు. సమస్య ప్రబలిన చోటునుంచి భారతీయులు పలాయనం చిత్తగించడం ఏమంత ఆదర్శపూరితమైనది కాదని చెప్పారు. పైగా చైనా నుంచి కేరళకు తిరిగి వస్తే 50 ఏళ్లు దాటిన తల్లిదండ్రులు, అత్తమామలు, తన భార్య పిల్లలకు కూడా అది ప్రమాదకరం అవుతుందనే కారణంతో వూహాన్ నుంచి కాలు కదపలేదని అరుణ్ జిత్ చెప్పారు. వూహాన్ అధికారులు నగరంలో లాక్ డౌన్ ఎత్తివేయగానే తామంతా సంబరపడిపోయమని వూహాన్లో ఉండిపోయిన భారతీయులు చెబుతున్నారు. సెంట్రల్ చైనాలోని వూహాన్ నగరంలో మొత్తం కోటీ 10 లక్షల మంది నివసిస్తున్నారు.