Leading News Portal in Telugu

లాక్‌డౌన్ ఎత్తివేత…బార్లు, వైన్ షాపుల ఎదుట జనం భారీగా క్యూ…ఎక్కడంటే…

76 రోజుల సుదీర్ఘం లాక్‌డౌన్‌ తర్వాత చైనాలోని వూహాన్ పట్టణం ఊపిరి పీల్చుకుంది. వూహాన్‌లో గడిచిన మూడు నెలలుగా కరోనా కరాళ నృత్యం చేసింది. దీంతో అక్కడి ప్రభుత్వం చాలా కఠిన నిబంధనలతో లాక్ డౌన్ చేసింది. లాక్ డౌన్ ఎత్తేసేనాటికి అక్కడ ఇంకా కరోనా వైరస్ కోసం చికిత్స పొందుతున్నవారు వున్నారు. ఇదిలా వుంటే వుహాన్‌లో కోవిడ్‌ వ్యాధికి చికిత్స పొందుతున్న చివరి రోగిని శుక్రవారం డిశ్చార్జ్‌ చేశారు. దీంతో వుహాన్‌లో కరోనా రోగి ఒక్కడు కూడా లేరని చైనా అధికారికంగా ప్రకటించింది. వుహాన్‌ రాజధానిగా ఉన్న హుబే ప్రావిన్స్‌లో 68,128 కరోనా కేసులు నమోదైతే అందులో వూహాన్‌లోనే 50,333 కేసులు నమోదయ్యాయి. లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత జనం బయటకు వచ్చి మళ్లీ తమ పాత జీవితానికి అలవాటుపడుతున్నారు. మెట్రోలు బిజీ అయ్యాయి. అంతేకాదు బార్లు లిక్కర్ షాపుల ఎదుట జనం గుంపులుగుంపులుగా కనిపిస్తున్నారు. యూత్ అయితే మాస్కులు ధరించి మద్యం పార్టీలు ఎంజాయ్ చేస్తున్నారు.

కరోనా వైరస్‌ జన్మ స్థలం అయిన వూహాన్‌ కరోనా ఫ్రీ సిటీగా అవతరించింది. కోవిడ్‌–19తో చికిత్స పొందుతున్న రోగులు ఒక్కరంటే ఒక్కరు కూడా ఆస్పతుల్లో లేరు. వ్యాధి నుంచి కోలుకొన్న 11 మందిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ చేయడంతో రోగుల సంఖ్య జీరోకి వచ్చింది. 2019 డిసెంబర్‌ చివరి వారంలో వైరస్‌ బయటపడిన తర్వాత తొలిసారిగా కరోనా రోగుల విషయంలో జీరో సాధించామని చైనా నేషనల్‌ హెల్త్‌ కమిషన్‌ వెల్లడించింది.