Leading News Portal in Telugu

త్వరలో కరోనాను మించిన విలయం.. ఐక్యరాజ్యసమితి తీవ్ర ఆందోళన..

కరోనా వైరస్.. ఈ మహమ్మారి దెబ్బకు పరిశ్రమలు మూతపడ్డాయి.. సంస్థల కార్యకలాపాలు ఆగిపోయాయి.. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి.. ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు.. మొత్తంగా ప్రపంచమే స్తంభించిపోయింది. కరోనా విపత్తు ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో కరోనాను మించిన విలయాన్ని ఎదుర్కొనవలసి వస్తుందని ఐక్యరాజ్యసమితి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అదే.. ఆకలి చావులు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది తినడానికి తిండి లేక అలమటిస్తున్నారు. పనికి పోతే చేతిలో పైసలుండేవి.. లాక్‌డౌన్ దెబ్బకు అవి కూడా లేకుండా పోయాయి. కాయాకష్టం చేసుకునే రోజూవారీ కూలీలు, రైతులు, రైతు కూలీలు, పేదలు.. బుక్కెడు బువ్వ కోసం పోరాటం చేస్తున్నారు. ఇప్పుడే దారుణ పరిస్థితి ఉండగా.. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో పెను సంక్షోభాన్ని చూడాల్సి వస్తుందని వరల్డ్ ఫుడ్ ప్రొగ్రామ్ చీఫ్ డేవిడ్ బిస్లే హెచ్చరించారు. ప్రపంచ వ్యాప్తంగా ఆహార సంక్షోభం మొదలవుతుందని, త్వరలోనే రోజుకు కనీసం 3 లక్షల మంది చనిపోతారని ఆయన బాంబ్ పేల్చారు.

కరోనా ఎఫెక్ట్‌తో ప్రపంచం స్తంభించిపోవడం ఆహార సంక్షోభానికి దారి తీస్తోందని, ఆకలితో ప్రపంచ వ్యాప్తంగా 3 కోట్ల మంది ఆకలి చావుల బారిన పడటం ఖాయమని చెప్పారు. ఇది కరోనాను మించిన విలయంగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే కోట్లాది మంది ఆకలితో బాధపడుతున్నారని, అందుకే ఐక్యరాజ్యసమితికి అభివృద్ధి చెందిన దేశాలు ఇచ్చే నిధుల్లో కోత పెట్టవద్దని విజ్ఞప్తి చేశారు. వీలైతే మరింత ఎక్కువ సహాయం చేయాలని కోరారు.